Virat Kohli : కోహ్లీకి కరోనా..టెస్ట్ మ్యాచ్ ఆడతాడా ?
ఇండియా, ఇంగ్లండ్ ఐదో టెస్ట్కు ముందు మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అశ్విన్ కొవిడ్ బారిన పడగా.. విరాట్ కోహ్లికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి.
- Author : Naresh Kumar
Date : 22-06-2022 - 4:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియా, ఇంగ్లండ్ ఐదో టెస్ట్కు ముందు మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అశ్విన్ కొవిడ్ బారిన పడగా.. విరాట్ కోహ్లికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇంగ్లండ్లో ల్యాండైన తర్వాత విరాట్కు కూడా కరోనా సోకిందని వెల్లడించింది. అంతకంటే ముందు అతడు మాల్దీవ్స్కు భార్య అనుష్కతో కలిసి వెకేషన్కు వెళ్లాడు. అయితే కోహ్లి కరోనా బారిన పడినా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తోంది. కోహ్లి లండన్లో షాపింగ్ అంటూ వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ, ఫ్యాన్స్తో సెల్ఫీలకు పోజులిచ్చాడు. అక్కడే అతను కోవిడ్ బారిన పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కోహ్లి కొద్ది రోజులగా జట్టు సహచరులతో క్లోజ్గా ఉండటంతో భారత శిబిరంలోనూ కరోనా కలవరం మొదలైంది. ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లి టీమ్ మేట్స్తో అత్యంత సన్నిహితంగా ఉండి ఫోటోలు దిగాడు. దీంతో మిగిలిన ఆటగాళ్ళకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక టీమిండియా ఇంగ్లండ్కు బయల్దేరడానికి ముందు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడ్డాడు. అఅతడు కోలుకున్నాడని, శుక్రవారం లండన్ వెళ్లనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పుడు విరాట్ కూడా కొవిడ్ నుంచి కోలుకున్నా.. ప్లేయర్స్కు కరోనా ముప్పు తొలగిపోలేదని తాజా పరిణామాలతో తెలుస్తోంది. మరోవైపు భారత ఆటగాళ్ళు షాపింగ్ కోసం బయట తిరగడంపైనా బోర్డు పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కోవిడ్ కారణంగానే గత ఏడాది జరగాల్సిన ఇండియా, ఇంగ్లండ్ ఐదో టెస్ట్ వాయిదా పడింది. ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ మ్యాచ్ నిర్వహించడానికి సిద్ధమవుతుండగా.. మరోసారి ఇరు జట్లనూ కరోనా టెన్షన్ పెడుతోంది.
Also Read :
Anushka Sharma: విరాట్ కోహ్లీ పై అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్