T20 Worldcup 2024: టీమిండియా సెమీఫైనల్ కు చేరేనా? ఆసీస్పై గెలిచినా??
- By Kode Mohan Sai Published Date - 05:53 PM, Thu - 10 October 24

T20 Worldcup 2024: మహిళల టీ20 ప్రపంచకప్లో 12వ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది, దీనితో సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి చెందిన టీమిండియా, తర్వాత పాకిస్థాన్ మరియు శ్రీలంక జట్లను వరుసగా ఓడించింది. తాజాగా, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది, ఈ మ్యాచ్ను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, షఫాలీ వర్మ (43) మరియు స్మృతి మంధాన (50) తొలి వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్ కేవలం 27 బంతుల్లో 1 సిక్స్, 8 ఫోర్లతో అజేయంగా 52 పరుగులు చేసింది. ఈ అర్ధశతకంతో, టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం, శ్రీలంక జట్టు లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించినప్పటికీ, 19.5 ఓవర్లలో కేవలం 90 పరుగులకే ఆలౌటైంది. దీంతో, టీమిండియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టుకు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది.
రెండో స్థానంలో భారత్:
వరుస విజయాలతో నెట్ రన్ రేట్ పెరిగి, టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టుకు +0.576 నెట్ రన్ రేట్ ఉంది. తమ చివరి మ్యాచ్లో అలవోకగా గెలిస్తే, టీమ్ ఇండియా సెమీఫైనల్కు చేరుకోగలదు. పాకిస్థాన్ (+0.555) మరియు న్యూజిలాండ్ (-0.050) కూడా సెమీఫైనల్ రేసులో ఉన్నాయి, ఈ జట్లు ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. టీమ్ ఇండియాకు మాత్రం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది, అందులో విజయం సాధిస్తే మొత్తం 6 పాయింట్లు వస్తాయి.
వచ్చే రెండు మ్యాచ్ల్లో పాకిస్థాన్ లేదా న్యూజిలాండ్ జట్లు భారీ విజయం సాధిస్తే, 6 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోవచ్చు. అందువల్ల, భారత జట్టుకు తమ చివరి మ్యాచ్లో పెద్ద విజయం సాధించడం అనివార్యం. ఇది వారికి మంచి నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించేందుకు సహాయపడుతుంది.
ఇక గ్రూప్ A పాయింట్ల పట్టికలో, ఆస్ట్రేలియా 2 విజయాలతో +2.524 నికర రన్ రేట్ కలిగి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్లో గెలిస్తే, మెరుగైన నెట్ రన్ రేట్తో సెమీఫైనల్కు అర్హత సాధించవచ్చు.
అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది, ఇది టీ20 ప్రపంచకప్ భవిష్యత్తును నిర్దారిస్తుంది.
టీమ్ ఇండియా సెమీ ఫైనల్ మార్గం ఎలా ఉందంటే:
- ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించాలి.
- న్యూజీలాండ్ జట్టు పాకిస్థాన్ లేదా శ్రీలంక జట్టుపై ఓడాలి.
- పాకిస్థాన్, న్యూజీలాండ్ మధ్య జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ గెలవాలి, కానీ ఆస్ట్రేలియాపై మాత్రం ఓడాలి.
- తదుపరి మ్యాచ్ల్లో పాకిస్థాన్ లేదా న్యూజీలాండ్ విజయం సాధించినా, నెట్ రన్ రేట్లో వెనుకబడాలని ఆశించాలి.