KKR vs RCB: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో ఆర్సీబీపై కేకేఆర్ విజయం
ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో కరణ్ శర్మ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బాదిన మూడు సిక్సర్లతో మ్యాచ్ ఆర్సీబీదే అనిపించినప్పటికీ ఆ అవకాశం కేకేఆర్ బౌలర్లు ఇవ్వలేదు.
- By Praveen Aluthuru Published Date - 11:00 PM, Sun - 21 April 24

KKR vs RCB: ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో కరణ్ శర్మ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బాదిన మూడు సిక్సర్లతో మ్యాచ్ ఆర్సీబీదే అనిపించినప్పటికీ ఆ అవకాశం కేకేఆర్ బౌలర్లు ఇవ్వలేదు. చివరి బంతికి అతను పేలవ షాట్ ఆడి స్టార్క్కి క్యాచ్ ఇచ్చాడు. తద్వారా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన బెంగుళూరు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది.
కోల్కతా నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ బ్యాటర్లు చమటోడ్చారు. రజత్ పాటిదార్ మరియు విల్ జాక్వెస్ అర్ధ సెంచరీతో రాణించారు. చివర్లో కరణ్ శర్మ కూడా అద్భుతంగా రాణించాడు. మిచెల్ స్టార్క్ వేసిన చివరి ఓవర్లో కరణ్ శర్మ మూడు సిక్సర్లు కొట్టి కేకేఆర్ ని కష్టాల్లోకి నెట్టాడు, అయితే ఆర్సీబీకి 2 బంతుల్లో 3 పరుగులు అవసరమైనప్పుడు బ్యాడ్ షాట్ ఆడాడు. ఈ విధంగా కోల్కతా1 పరుగు తేడాతో ఆర్సీబీని ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 48 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఆండ్రీ రస్సెల్ 27 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా, రమణదీప్ సింగ్ 24 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 200 దాటించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ, డుప్లిసిస్ నిరాశపరిచారు. కోహ్లీ18, డుప్లెసిస్ 7 పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత విల్ జాక్వెస్ 55 పరుగులు, రజత్ పాటిదార్ 52 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డు పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో రస్సెల్ వాళ్ళిద్దర్నీ ఒకే ఓవర్లో అవుట్ చేసి కేకేఆర్ కు మంచి బ్రేక్ ఇచ్చాడు. చివర్లో కరణ్ శర్మ 7 బంతుల్లో 20 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
We’re now on WhatsApp : Click to Join
ఆర్సీబీ ఈ సీజన్లో 8 మ్యాచ్లలో 7 ఓడిపోయింది. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్పై మాత్రమే విజయం సాధించింది. ప్లేఆఫ్కు చేరుకోవాలన్న ఆర్సీబీ ఆశలు దాదాపుగా ముగిశాయి. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ నిరాశకు గురయ్యాడు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ల ఓవర్లు మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచాయని ఫాఫ్ చెప్పాడు.
Also Read: Harish Rao: ఇందిరాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు