T20I Series : చివరి టీ ట్వంటీలోనూ భారత్ విక్టరీ…సిరీస్ 4-1తో కైవసం
ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది
- Author : Sudheer
Date : 03-12-2023 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో (T20I Series) భారత్ (India ) 6 పరుగుల ( 6-run win against Australia) తేడాతో విజయం సాధించింది. చివరి వరకూ ఆసీస్ పోరాడినప్పటకీ పుంజుకున్న భారత బౌలర్లు వారి జోరుకు బ్రేక్ వేయడంతో మన జట్టునే విజయం వరించింది. దీంతో భారత్ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ఓ మోస్తారు ఆరంభాన్నిచ్చారు. యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తొలి వికెట్ కు 33 పరుులు జోడించారు. అయితే వీరిద్దరూ తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో భారత్ స్కోరు వేగానికి బ్రేక్ పడింది. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ కూడా ఔట్ అవడంతో కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మతో కలిసి ఐదో వికెట్ కు 42 పరుగులు జోడించారు. శ్రేయాస్ అయ్యర్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 , జితేశ్ శర్మ 24 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. 21 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఫలితంగా టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది.
161 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా త్వరగానే ఓపెనర్ ఫిలిప్ వికెట్ కోల్పోయింది. అయితే ట్రావిడ్ హెడ్ , బెక్ డెర్మాట్ ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. హెడ్ 28 పరుగులకు ఔటవగా… డెర్మాాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో పుంజుకున్న భారత బౌలర్లు ఆసీస్ ను మళ్లీ కట్టడి చేశారు. వరుస వికెట్లతో కంగారూలపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా ముకేశ్ కుమార్ 17వ ఓవర్లో వరుసగా 2 వికెట్లు పడగొట్టి విజయానికి చేరువ చేశాడు. 18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి ఉండగా…అవేశ్ ఖాన్ 15 రన్స్ ఇవ్వడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి 2 ఓవర్లలో 17 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ముఖేశ్ కుమార్ 7 పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా… అర్షదీప్ సింగ్ అద్భుతంగా ఆసీస్ ను కట్టడి చేశాడు. మూడో బంతికే వేడ్ ను పెవిలియన్ పంపాడు. దీంతో ఆసీస్ 154 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో టీ ట్వంటీ సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారు.
Read Also : Telangana : గాంధీభవన్లో టీడీపీ జెండాలతో సంబరాల్లో పాల్గొన్న తెలుగు తముళ్లు