Captain Bumrah: కెప్టెన్ గా ఎంపికయ్యాక బూమ్రా రియాక్షన్ ఇదే
రోహిత్ శర్మ కరోనా కారణంగా దూరమవడంతో ఇంగ్లాండ్తో జరగనున్న చివరి టెస్టు మ్యాచ్కు భారత సారథిగా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు.
- Author : Naresh Kumar
Date : 01-07-2022 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
రోహిత్ శర్మ కరోనా కారణంగా దూరమవడంతో ఇంగ్లాండ్తో జరగనున్న చివరి టెస్టు మ్యాచ్కు భారత సారథిగా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. దీంతో భారత టెస్టు టీమ్కు కెప్టెన్ అయిన 36వ క్రికెటర్గా బుమ్రా నిలిచాడు. అలాగే 1987 తర్వాత టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన తొలి పేసర్గానూ ఘనత సాధించాడు. అంతకుముందు కపిల్ దేవ్ సారథ్య బాధ్యతలను నిర్వర్తించాడు. కుంబ్లే తర్వాత ఒక బౌలర్ భారత్కు కెప్టెన్ కావడం ఇదే తొలిసారి కాగా, కపిల్దేవ్ తర్వాత నాయకత్వం వహిస్తున్న మొదటి పేసర్. అయితే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ భారత టెస్టు కెప్టెన్ కావడం మాత్రం ఇదే మొదటిసారి.
కెప్టెన్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన బుమ్రా.. ఇది తన కెరీర్లోనే తను సాధించిన అతిపెద్ద ఘనతని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ బాధ్యత పెద్ద గౌరవంగా భావిస్తున్నాననీ, దేశం తరఫున టెస్టు మ్యాచ్ ఆడటం తన కలగా చెప్పిన బూమ్రా కెప్టెన్సీ రావడం కెరీర్లోనే గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పాడు. పాత కెప్టెన్లు ధోనీ, విరాట్ కోహ్లీ గురించి నేర్చుకున్న విషయాల గురించి అడగ్గా.. తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉంటుందని, అయితే ఎవరి దగ్గర బెస్ట్ ఉన్నా అది వారి నుంచి నేర్చుకుంటానని తెలిపాడు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాననీ, అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. గతవారం లీసెస్టర్తో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకోకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను బుమ్రాకు వైస్ కెప్టెన్ గా ఉన్న బూమ్రాకు అప్పగించక తప్పలేదు.