Extra Marital Affair: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య
- Author : Vamsi Chowdary Korata
Date : 19-05-2026 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ రాజధాని ఢిల్లీలో మానవ సంబంధాల విలువలను నడిరోడ్డుపై తగలబెట్టేలా అత్యంత క్రూరమైన, భయానకమైన ఘటన చోటుచేసుకుంది. తన భార్యకు ఉన్న వివాహేతర సంబంధం గురించి నిలదీసినందుకు, ఆ భార్య తన తల్లితో కలిసి భర్తపైనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని నార్త్ వెస్ట్ జిల్లా జహంగీర్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులైన తల్లీకూతుళ్లను పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
బాధితులు నివసిస్తున్న ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని తెలిపిన వివరాల ప్రకారం… రాత్రి 8:30 గంటల సమయంలో సదరు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చుట్టుపక్కల వారు దానిని షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా భావించారు. కానీ అంతలోనే ఊహించని విధంగా ఒక యువకుడు ఒంటిపై బట్టలు లేకుండా, ఒళ్లంతా మంటలు కాలిపోతూ ప్రాణభయంతో కేకలు వేస్తూ మెట్లపై నుండి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడి మరణానికి అత్యంత చేరువలో ఉన్న ఆ యువకుడు చనిపోయే ముందు ఇచ్చిన ఆఖరి స్టేట్మెంట్ స్థానికంగా పెను సంచలనంగా మారింది.
ఘటనా స్థలానికి చేరుకున్న ఒక పోలీస్ అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆ యువకుడి ఆఖరి వాంగ్మూలాన్ని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ మరణ వాంగ్మూలంలో బాధితుడు.. తన భార్య, అత్త మరికొందరు వ్యక్తుల సహాయంతో తనపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని స్పష్టంగా ఆరోపించాడు. తన భార్యకు వేరే వ్యక్తులతో ఉన్న వివాహేతర సంబంధాల విషయమై ఇంట్లో గొడవ జరిగిందని, ఆ కక్షతోనే తనను అంతమొందించడానికి వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వెల్లడించాడు.
ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, సదరు యువకుడు మంటల్లో కాలిపోతూ కిందకు రావాలని పిలిచినా, అతని భార్య కనీసం జాలి చూపకుండా “అతడిని అలాగే కాలిపోనివ్వండి” అంటూ క్రూరంగా మాట్లాడినట్లు ఇంటి యజమాని పోలీసులకు సాక్ష్యమిచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.