MLC Kavitha: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై కవిత ఫైర్!
చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.
- By Balu J Published Date - 01:16 PM, Wed - 18 May 22

చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బీజేపీ నాయకులకు ఉన్నదా ? అంటూ నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా ? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా ? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా ? తెలంగాణ లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను , ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మరియు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు అని కవిత మండిపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారని, మంత్రి కేటీఆర్ అనేకమార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగిందని కవిత గుర్తు చేశారు. ఎన్నో కుటుంబాలు ఆధార పడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనక ఉన్న అర్థం ఏమిటి? కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీని అడుగడుగునా ప్రశ్నించాలి అని కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉంది అని, ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండా ఉందని, రాహుల్ గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కవిత రాహుల్ గాంధీకి సూచించారు. మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారింది. రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుందని, ప్రాంతీయ పార్టీలే సారథ్య బాధ్యతలు వహిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయని, దేశంలో నిరుద్యోగం పెరిగిందని, మతపరమైన సహనం లోపించిందని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల విజయంపై కాంగ్రెస్ అసూయ వ్యక్తం చేస్తుందని, మెరుగైన పాలన అందిస్తున్నాము కాబట్టి ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.