TRS State-Wide Protests : బీజేపీ కోవర్ట్ ఆపరేషన్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు టీఆర్ఎస్ పిలుపు
అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసేందుకు జరిగిన కుట్రను పోలీసులు...
- Author : Prasad
Date : 27-10-2022 - 7:08 IST
Published By : Hashtagu Telugu Desk
అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ క్యాడర్ నిరసనలకు దిగింది. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రాస్తారోకోలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి భయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని మంత్రులు ఆరోపించారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ సమీపంలో బుధవారం రాత్రి టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ ప్రజల మనసు గెలుచుకునే దమ్ములేక బిజెపి పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ చౌటుప్పల్ వద్ద విజయవాడ హైవేపై రాస్తారోకో చేసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. #TelanganaNotForSale pic.twitter.com/lnKGXrIHQA
— V Srinivas Goud (@VSrinivasGoud) October 26, 2022