Monsoon in 3 days: వచ్చే మూడు రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
వచ్చే మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
- By Hashtag U Published Date - 04:30 PM, Sun - 29 May 22

వచ్చే మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే ముందుగానే జూన్ 1 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వేసవి నుంచి ఉపశమనం కలిగించే విధంగా దేశవ్యాప్తంగా గత పది రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు నైరుతి రుతుపవనాల ప్రవేశంతో మరో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారతదేశంలో రుతుపవనాల ప్రారంభం మొదట కేరళ నుంచే ప్రారంభమవుతుందని.. జూన్ 1 నుంచి రుతుపవనాల కదలికలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జూన్ – సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. అయితే కేరళ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇదిలావుండగా శనివారం ఉత్తర కర్ణాటకపై ఉపరితల ఆవర్తనం, సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కర్ణాటక పరిసర ప్రాంతాలు విస్తరిస్తున్నందున రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మరియు ఈదురు గాలులు పడే అవకాశం ఉంది.