Pink Ball Test: బెంగళూరు టెస్టులో భారత్ 252 ఆలౌట్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పింక్బాల్ టెస్టులో భారత్ తడబడి నిలబడింది. లంక స్పిన్నర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది.
- By Naresh Kumar Published Date - 10:17 PM, Sat - 12 March 22
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పింక్బాల్ టెస్టులో భారత్ తడబడి నిలబడింది. లంక స్పిన్నర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 4 , రోహిత్శర్మ 15 పరుగులకే ఔటయ్యారు. తర్వాత విహారీ, కోహ్లీ ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు 47 పరుగులు జోడించగా.. లంక స్పిన్నర్లు పుంజుకోవడంతో వెంటనే వెంటనే ఔటయ్యారు. కోహ్లీ 23 పరుగులకు ఔటవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
కోహ్లీ సెంచరీ చేసి మూడేళ్ళు అవుతుండడం, బెంగళూరులో అభిమానులు విరాట్ బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తి చూపించడంతో టిక్కెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో వారంతా నిరాశ చెందారు. ఇక ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ టీ ట్వంటీ తరహాలో ధాటిగా ఆడి అభిమానులను అలరించాడు. 26 బంతుల్లోనే 7 ఫోర్లతో 39 పరుగులకు ఔటవగా.. జడేజా, అశ్విన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో భారత్ 148 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి స్కోర్ 250 దాటించాడు. ఎక్కువసేపు తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ జాగ్రత్తగా ఆడిన అయ్యర్ 8 పరుగుల తేడాలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే తరహాలో ఆడిన అయ్యర్ 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 రన్స్ చేశాడు.
బౌలర్లలో ముగ్గురు స్పిన్నర్లు సమిష్టిగా రాణించారు. లసిత్ 3 , జయవిక్రమ 3, ధవంజయ డిసిల్వా 2 వికెట్లతో భారత్ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇరు జట్లూ స్పిన్ వ్యూహంతోనే ఆడుతున్నాయి. పింక్ బాల్ అయినప్పటకీ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్తోనే బరిలోకి దిగాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే తొలి ఇన్నింగ్స్లో లంక స్పిన్నర్లు రాణించారు. ఫామ్లో ఉన్న భారత స్పిన్నర్లు కూడా చెలరేగే అవకాశముండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
Related News
IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు, సిక్సులు, వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ -2024 లీగ్ రౌండ్ ముగిసింది. ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.