West Godavari: తుపాన్ ఎఫెక్ట్, పశ్చిమగోదావరి జిల్లాలో 15 వేల హెక్టార్ల పంట నష్టం
- By Balu J Published Date - 09:46 AM, Fri - 8 December 23

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన తుపాను వర్షాలకు 15 వేల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి దువ్వ, వరిమేడు, తిరుపతిపురం తదితర గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల నిబంధనలను సడలించిందని, రైతులు తమ దెబ్బతిన్న వరిని తమ రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళ్లవచ్చని మంత్రి తెలిపారు. యర్ర కాలువ, యన్మదుర్రు డ్రెయిన్ పొంగిపొర్లడంతో తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, పెంటపాడు, గణపవరం, పాలకోడేరు, భీమవరం పట్టణాల్లోకి నీరు చేరుతోందని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.