Lagacharla incident : పోలీసులపై హైకోర్టులో నరేందర్ భార్య పిటిషన్
డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్లో శృతి పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు.
- By Latha Suma Published Date - 03:55 PM, Thu - 21 November 24

Contempt of Court Petition : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు జరిగిందని పట్నం శృతి హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్లో శృతి పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు. ప్రతివాదులుగా ఉన్న పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. ఈ పిటిషన్ను హైకోర్టు రేపు(శుక్రవారం) విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, అరెస్ట్ సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదంటూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. కాగా తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని తెలిపారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టు పట్నం నరేందర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విధానంపై తప్పుపట్టింది. నరేందర్రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా అరెస్టు తీరును తప్పుపట్టింది. ఇక కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు? మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. నరేందర్రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? అంటూ.. పీపీపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని.. తీవ్ర గాయాలపై రిపోర్టు ఇచ్చి చిన్న గాయాలైనట్లుగా రాశారని హైకోర్టు పేర్కొంది.