Tribal Votes: గిరిజన ఓట్లు కోసం బీజేపీ గేమ్ ఆడుతుంది.. మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
- By HashtagU Desk Published Date - 04:00 PM, Wed - 30 March 22

గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉంటే రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మాణం చేసినప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నాయకుడుగా కిషన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుకుంటే కేంద్రం అడ్డుపడకుండా బాధ్యత తీసుకుంటానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్లను రాష్ట్ర పరిధిలో 10శాతం పెంచుకోవచ్చని కేంద్రం నుంచి అధికారికంగా సమాధానం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని హైదరాబాద్, మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. మంత్రి వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
బంజారాల కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రు నాయక్, అసోసియేట్ అధ్యక్షులు ఆర్. మోహన్ సింగ్, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సరోజా సింగ్ , మిగిలిన సభ్యులకు చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దాదాపు 81వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న క్రమంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోనున్నారు అన్నారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మాణాన్ని కేంద్రానికి పంపితే ఇన్నేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు.
రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినప్పుడు బిజెపి శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రమే పెంచుకోవచ్చు, కేంద్రం అడ్డుకుంటే దానికి నేను బాధ్యత వహిస్తాననడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.ఇన్ని రోజులు గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్, బీజేపీలు మరోసారి గిరిజనులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్న క్రమంలో గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలంటే కచ్చితంగా కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు.
ఇది చేయకుండా కేవలం దాటవేత ధోరణితో, గిరిజనులను మభ్యపెట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతూ, గిరిజనుల్లో బేధాలు కల్పిస్తూ విభజించి, పాలించే రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బంజారాలు తగిన బుద్ది చెప్పాలని, ఈ విషయంలో ఆలిండియా బంజారా సేవా సంఘం తన పాత్రను కీలకంగా పోషించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఆలిండియా బంజారసేవా సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు కిషన్ సింగ్ రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రుపావత్ కిషన్ నాయక్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గోపిచంద్ రాథోడ్, సభ్యులు రాంబాబు నాయక్, హరిసింగ్ జాదవ్ తదితరులున్నారు.