Prashanth Reddy: గుండె ఆపరేషన్ కోసం 3 లక్షల అందజేత
- By Balu J Published Date - 11:13 AM, Thu - 15 June 23

అనారోగ్యం బారినపడి వైద్య ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత లేని బాధితులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. సీఎం సహయనిధి నుండి కోట్ల రూపాయలు ఇప్పించి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. నా నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అని చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఏ ఆపద వచ్చినా తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇస్తున్నారు.
తాజాగా.. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామానికి చెందిన సిహెచ్.వరలక్ష్మి గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నది. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. 3 లక్షల ఎల్ఓసి కాపీ ని బాధిత మహిళ భర్త సిహెచ్. గంగాధర్ కు మంత్రి గురువారం హైదరాబాద్ లో అందజేశారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం చెప్పారు.
నిరుపేదలమైన తమకు గుండె ఆపరేషన్ కొరకు 3లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాకు అండగా నిలిచారని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి గారి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు.