Agastya Jaiswal : ఇంటర్ రెండు విభాగాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు
- Author : Prasad
Date : 29-06-2022 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: బైపీసీ, సీఈసీ రెండు విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి విద్యార్థిగా హైదరాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్ నిలిచాడు. మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అగస్త్య జైస్వాల్ బైపిసిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో శ్రీ చంద్ర కళాశాల నుండి 81 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రకటించింది. అగస్త్య జైస్వాల్ 11 సంవత్సరాల వయస్సులో ఒక ప్రైవేట్ కళాశాల నుండి CEC లో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తెలంగాణలోనే అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. 2020లోబకేవలం 14 సంవత్సరాల వయస్సులోబఅగస్త్య జైస్వాల్ భారతదేశంలో BA మాస్-కమ్యూనికేషన్ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడయ్యాడు. అలాగే కేవలం 9 సంవత్సరాల వయస్సులో అగస్త్య తెలంగాణలో SSC ఉత్తీర్ణత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. తన తల్లిదండ్రుల మద్దతు, శిక్షణతో తాను సవాళ్లను అధిగమిస్తున్నానని అగస్త్య జైస్వాల్ తెలిపాడు. అగస్త్య జైస్వాల్ కేవలం 1.72 సెకన్లలో A నుండి Z వర్ణమాలలను టైప్ చేయగలడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇదేకాక అతను సవ్యసాచి అని.. రెండు చేతులతో వ్రాయగలడని తెలిపారు. అగస్త్య జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడిగా ఉన్నారు. అగస్త్య జైస్వాల్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి , యంగెస్ట్ రీసెర్చ్ స్కాలర్ నైనా జైస్వాల్ సోదరుడు.