CM Revanth Counter To KCR: మీతో ప్రజలకేం పని లేదు.. కేసీఆర్కు సీఎం రేవంత్ కౌంటర్!
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు.
- Author : Gopichand
Date : 11-11-2024 - 4:12 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Counter To KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ (CM Revanth Counter To KCR) ఇచ్చారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నాడు.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని కౌంటర్ ఇచ్చారు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. 1 కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90 వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారన్నారు.
అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
Also Read: Congress Promises : కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ ప్రశ్నల వర్షం..
త్వరలో వారికి నియామకపత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామన్నారు. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేసాం. మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండని సూచించారు. బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామని ఎద్దేవా చేశారు.