CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.
- Author : Kode Mohan Sai
Date : 14-12-2024 - 12:28 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu On Jamili Elections: జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లుకు ఆమోదం తెలిపింది, మరియు ఈ బిల్లు ఈ నెల 16 న పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే జరుగుతాయని తెలిపారు. “ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానానికి మా మద్దతు ఎప్పుడో ప్రకటించాం” అని ఆయన చెప్పారు.
వైసీపీ నేతలపై ఆయన విమర్శలు చేసిన ఆయన, జమిలీ ఎన్నికలపై అవగాహన లేకుండా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని వైసీపీ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. “వైసీపీ పబ్బం గడుపుకోవడానికే ఏదిపడితే అది మాట్లాడుతోందని” ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని, “వాళ్ల డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు” అని సెటైర్లు వేశారు.
సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు సీఎం చంద్రబాబు:
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న మనోభావాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజన్ పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి స్థాయిలో చర్చలు జరగాలని ఆయన సూచించారు.
“విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరానికి తెలియాలి,” అని ఆయన అన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను, 2020 నాటి పరిణామాలను పోల్చుకుంటే, విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047లో కూడా ఈ మార్పులు చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను “ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్రమం” కాదని, భవిష్యత్తు తరాల సార్ధకత కోసం ఈ ప్రయత్నం చేపట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. “ఈ విజన్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై, రేపటి తరాల భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు”.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ కోసం ఆకాంక్ష
సాగునీటి సంఘాలు, సహకార, ఇతర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈసారి నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అనేక మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. “సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు.
ముందుగానే, కలెక్టర్లు మరియు ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండాను పంపించి, వాటిపై సమాధానాలు కోరుతామని తెలిపారు. “ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం, అలాగే మంత్రులు-అధికారుల మధ్య ఇంటరాక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “అద్వాణీతో నాకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది” అని సీఎం చంద్రబాబు అన్నారు.