ట్రంప్కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
- Author : Vamsi Chowdary Korata
Date : 21-02-2026 - 9:08 IST
Published By : Hashtagu Telugu Desk
1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట్టుకుని సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్ పరిధిలోని అంశమని 6-3 మెజారిటీతో తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ ఏకపక్ష వాణిజ్య నిర్ణయాలకు అడ్డుకట్ట పడింది.
సుప్రీంకోర్టు తీర్పు భారత వాణిజ్య వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే వస్తువులపై 18 శాతం సుంకం విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదన తాజా తీర్పుతో చెల్లకుండా పోయింది. అంతేకాకుండా, ఇప్పటివరకు అక్రమంగా వసూలు చేసిన పన్నులను తిరిగి పొందేందుకు భారత కంపెనీలకు అవకాశం లభించనుంది. ఫలితంగా అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీతత్వం పెరగనుంది.
అయితే, ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దీనిని ‘సిగ్గుచేటు’గా అభివర్ణించిన ఆయన, మరో చట్టంలోని సెక్షన్ 122 కింద అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తానని ప్రకటించారు. అదే సమయంలో భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ టారిఫ్లు చెల్లించాల్సిందేనని ఆయన నొక్కిచెప్పడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతానికి ఊరటనిచ్చినా, ట్రంప్ తాజా హెచ్చరికలతో వాణిజ్య రంగంలో కొంత అనిశ్చితి నెలకొంది.