Telangana: పాఠశాల పనివేళలపై విద్యాశాఖ కీలక నిర్ణయం
- Author : Balu J
Date : 25-07-2023 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల పనివేళలు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అవి తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, హైస్కూళ్లు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేయనున్నాయి. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మినహా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజా ఉత్తర్వులను వెంటనే అమలులోకి తెచ్చేలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు విద్యాశాఖ పంపించింది.
వారి పరిధిలోని ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, హైస్కూళ్లు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి.