Thailand decision on Sri Lanka Elephant : శ్రీలంక నుండి థాయ్ ఏనుగు మరలా థాయిలాండ్ కు.
ఇరవై ఏళ్ల కిందట థాయ్ (Thailand) రాజు శ్రీలంకకు ఏనుగును బహుమతిగా ఇచ్చాడు. శ్రీలంకలో దానిని తీవ్రంగా హింసిస్తున్నారని బాగా విమర్శలు రావడంతో థాయిలాండ్ ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.
- By Vamsi Chowdary Korata Published Date - 04:10 PM, Tue - 4 July 23
Thailand decision on Sri Lanka Elephant : ఇరవై ఏళ్ల కిందట థాయ్ రాజు శ్రీలంకకు ఏనుగును బహుమతిగా ఇచ్చాడు. శ్రీలంకలో దానిని తీవ్రంగా హింసిస్తున్నారని బాగా విమర్శలు రావడంతో థాయిలాండ్ ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేసి దాన్ని ప్రత్యేక విమానంలో థాయిలాండ్ తీసుకెళ్లిపోయింది. 2001లో థాయ్ రాజకుటుంబం ఈ ఏనుగును శ్రీలంకకు బహూకరించింది. అప్పుడు దాని వయసు 10 సంవత్సరాలు. థాయిలాండ్లో (Thailand) ఈ ఏనుగును ‘సాక్ సురిన్’, ‘మైటీ సురిన్’ అని పిలుస్తారు. శ్రీలంక చేరుకున్న తర్వాత దానికి ‘ముత్తురాజా’ అని పేరు పెట్టారు. ఓ బుద్ధిస్ట్ టెంపుల్లో దాన్ని ఉంచి మతపరమైన వేడుకల్లో పాల్గొనేలా శిక్షణ ఇచ్చారు. ఏనుగు ఆరోగ్యం బాగా లేకపోయినా ప్రదర్శనలు చేయిస్తున్నారని ఇటీవలి కాలంలో చాల విమర్శలు వెల్లువెత్తాయి.
2020లోనే దాని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ర్యాలీ ఫర్ యానిమల్ రైట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (రేర్) అనే సంస్థ వెల్లడించింది. కొన్ని కఠినమైన పనులు కూడా ముత్తు రాజాతో చేయిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. దుంగలు లాగే పనుల్లో ఏనుగును ఉపయోగించారని, అదుపులో పెట్టే క్రమంలో కొంత మంది దాన్ని గాయపరిచినట్లు ‘రేర్’ సంస్థ గుర్తించింది. దాంతో కాందే విహారాయ టెంపుల్ నుంచి దానికి విముక్తి కల్పించాలని ఆ సంస్థ శ్రీలంక ప్రభుత్వానికి విన్నవించింది. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఏనుగును తిరిగి తీసుకెళ్లాలని ఏకంగా థాయ్లాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శ్రీలంక, థాయిలాండ్ దేశాలు ఏనుగును పవిత్రమైన జంతువుగా కొలుస్తాయి. అలాంటి జంతువు విషయంలో రెండు దేశాల మధ్య దౌత్య పరమైన వివాదం చెలరేగింది. ‘రేర్’ విజ్ఞప్తి మేరకు టెంపుల్లో పరిస్థితిని ఆరా తీయమని థాయ్ ప్రభుత్వం శ్రీలంకలోని థాయ్ రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది.
దాంతో దౌత్య అధికారులు అక్కడకు వెళ్లి చూడగా ఏనుగు ఆరోగ్యం బాగాలేదని, దాని జీవన స్థితి దీనంగా ఉన్నట్లు గుర్తించారు. అది తక్కువ బరువుతో బలహీనంగా ఉంది. దాని చర్మం కరకుగా మారింది. రెండు చోట్ల గడ్డలు ఏర్పడ్డాయి. అరి పాదాలు పలుచనై పోయాయి. నడవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. ఈ వివరాలు థాయ్ విదేశాంగ మంత్రిత్వశాఖకు అందించారు థాయ్ ప్రభుత్వ జోక్యంతో గతేడాది నవంబర్లో ఏనుగును కొలంబోలోని నేషనల్ గార్డెన్కు తరలించారు. అక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. కానీ, సౌకర్యాల లేమి కారణంగా పూర్తి స్థాయి చికిత్స అందలేదు. మెరుగైన వైద్య సదుపాయాలు అక్కడ లేవని శ్రీలంక జంతు వైద్యులు తేల్చి చెప్పారు. ముత్తు రాజా ఆరోగ్యం కొంత మెరుగు పడినట్లు నిర్ధారించుకున్న తరువాత దాన్ని స్వదేశం రప్పించేందుకు థాయ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఇల్యూషిన్ 2- 76 కార్గో విమానాన్ని శ్రీలంకకు పంపించింది.
4వేల కిలోల బరువున్న ఏనుగును ఒక ఇనుప పెట్టెలో ఉంచి విమానంలోకి ఎక్కించారు. దాని వెంట ఇద్దరు జంతు వైద్యులు, నలుగురు మావటిలు ఉన్నారు. అలా సుమారు ఐదు గంటలు ప్రయాణించి థాయిలాండ్లోని (Thailand) చియాంగ్ మాయ్ నగరానికి దాన్ని చేర్చారు. ఈ రవాణాకు సుమారు రూ.4 కోట్లు ఖర్చయినట్లు థాయ్ పర్యావరణ శాఖ మంత్రి వరావుట్ శిల్పా తెలిపారు. ప్రస్తుతం ఏనుగును లాంపాంగ్ ప్రావిన్స్లోని ‘థాయ్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ సెంటర్’లో ఉంచారు. అక్కడే హైడ్రో, లేజర్ థెరపీ, ఆక్యుపంక్చర్ వైద్య చికిత్సలు అందజేయనున్నారు. శరీరంపై ఉన్న గాయాలు పూర్తిగా నయం కావడానికి ఏడాది సమయం పట్టొచ్చని మంత్రి శిల్పా అభిప్రాయపడ్డారు. ముత్తు రాజా తరలింపుతో దానికి కొత్త జీవితం ప్రసాదించినట్లైందని రేర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు పంచాలి పనపిటియా తెలిపారు.
శ్రీలంక వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఏనుగును కాపాడటంలో విఫలమయ్యారని, ఆ చర్య దేశానికే అపకీర్తి తెచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. బహుమతిగా ఇచ్చిన జంతువును థాయ్ తిరిగి తీసుకెళ్లడం పట్ల శ్రీలంక మంత్రి వన్నియారాచ్చి స్పందించారు. ఈ విషయంలో థాయ్ ప్రభుత్వం కాస్త మొండిగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. అయితే గత నెలలో శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్ధన పార్లమెంటులో మాట్లాడుతూ ఏనుగు పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. థాయ్ రాజు మహా వజిరాంగ్కార్న్కు క్షమాపణలు చెప్పారు. జంతు ప్రేమికుల ఆందోళనలు అధికం కావడంతో థాయ్ ప్రభుత్వం ఏనుగులను విదేశాలకు పంపడం మూడేళ్ల కిందటే ఆపేసింది. ముత్తురాజాను తిరిగి రప్పించిన నేపథ్యంలో ఇప్పటికే విదేశాల్లో ఉన్న తమ దేశానికి చెందిన జంతువుల పరిస్థితి ఎలా ఉందోనని బ్యాంకాక్ వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: Pawan Kalyan @ Instagram : ఇంస్టాగ్రామ్ లో పవర్ స్టార్.. నిమిషాల్లోనే లక్షల ఫాలోయర్లు
Related News
RBI Announces Mobile App: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్బీఐ మొబైల్ యాప్ను ప్రకటించింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కోసం డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేస్తుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు