దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
- By Hashtag U Published Date - 05:07 PM, Thu - 14 October 21
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది. ప్రపంచం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి ఫ్లోర్ కట్టడం నేర్చుకుంటున్న రోజుల్లో… భారతదేశంలో ఆకాశాన్ని తాకే గోపురాల నిర్మాణాలు జరిగాయి. ఈ ఆర్కిటెక్చరల్ టాలెంట్ ఉత్తరాదిన కనిపించదు. అక్కడన్నీ ఇరుకైన, చిన్నచిన్న గుళ్ల నిర్మాణమే జరిగింది. అదే దక్షిణాదిన అయితే.. విగ్రహ మూర్తికి ప్రత్యేక గోపురంతో పాటు నలువైపులా రాజగోపురాలు నిర్మించారు.
భారతీయ సంస్కృతిలో రెండు భిన్న పార్శ్వాలున్నాయి. ఉత్తర, దక్షిణ భారత ఆలయాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఉత్తరాదిన ఎక్కువగా శిఖరాల మీద ఉన్న ఆలయాలు కనిపిస్తాయి. బ్రిటిష్, మొఘల్ సామ్రాజ్యాల ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. కాని, దక్షిణాదిన ఉండే గుళ్లు.. అక్కడి జీవనశైలిని ప్రతిబింబించేదిగా ఉంటాయి. ఆలయాలు సంగతి పక్కన పెడితే.. దక్షిణాదిన ఉన్న ద్రవిడులు.. తామే అసలైన భారతీయులమని చెప్పుకుంటారు. ఉత్తరాది వాళ్లంతా ఆర్యులు, ఈ దేశానికి వలస వచ్చిన వారుగా విభజించి చూస్తారు. రాజకీయంగా పెత్తనం మొత్తం ఉత్తరాది వారిదే కనిపిస్తుంది.
సంస్కృతుల పరంగానూ ఉత్తర, దక్షిణాది మధ్య చాలా తేడాలున్నాయి. ఉత్తర భారతం నుంచి దక్షిణాదికి వచ్చే కొద్దీ.. మనుషుల మేని ఛాయలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా భాష, యాసలోనూ ఎక్కడికక్కడ విభిన్నంగా ఉంటాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు మెలిక రాతలతో కూడి ఉంటాయి. మాట్లాడే యాస కూడా నర్తిస్తున్నట్టు కనిపిస్తుంది. నార్త్ వాళ్లు కాస్త తెల్లగా ఉంటే.. సౌత్ వస్తున్న కొద్దీ నలుపు వర్ణంలో ఉంటారు. పైగా ఉత్తరాది ఆడవాళ్లు సల్వార్ కమీజ్లు, మగవాళ్లు షర్ట్స్, పైజామా ధరిస్తే.. దక్షిణాది ఆడవాళ్లు చీరలు కట్టుకుంటారు. మగవాళ్లు దోతీలు, లుంగీలు కడతారు. ఆహార అలవాట్లలోనూ చాలా తేడాలున్నాయి. మాంసం ప్లేసులో కూరగాయలు, కొబ్బరి పాలు, రసం, సాంబార్లు కనిపిస్తాయి.
దక్షిణాదిన అబ్బురపరుస్తున్న ఆలయాలు
మధుర మీనాక్షి ఆలయం, తమిళనాడు
ద్రవిడ ఆలయాల్లో అత్యద్భుతం అనిపిచే ఆలయం మీనాక్షి అమ్మన్ టెంపుల్. ఆలయానికి నలువైపులా 12 గోపురాలను ఒక్కోటి 52 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఆలయ విస్తీర్ణం 25 ఫుట్ బాల్ స్టేడియాలతో సమానం ఉంటుంది. రోజుకు 25వేల మంది భక్తులు మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనానికి కేవలం హిందువులను మాత్రమే అనుమతిస్తారు. కాని, గాలి గోపురాలు, గుడి బయటి శిల్పాలను చూడ్డానికి అనుమతి ఉంటుంది. ఒక్కో గోపురంపై అనేకమైన దేవీదేవతల మూర్తులు చెక్కబడి ఉంటాయి. ఒక్క దక్షిణ గాలిగోపురంపైనే ఏకంగా 1511 విగ్రహాలు చెక్కారు. ఇదొక అద్భుతం. జాగ్రత్తగా గమనిస్తే.. వేదాలు, పురాణాల్లో ఉండే ఎంతో మంది దేవతలు గోపురాలపై కొలువైనట్టు కనిపిస్తారు. ప్రతి ఏటా చైత్రమాసంలో జరిగే శివపార్వతుల కల్యాణానికి ఏకంగా పది లక్షల మంది భక్తులు తరలివస్తారు.
మహాబలిపురం, తమిళనాడు
పల్లవుల పాలనలో నిర్మించిన మామళ్లాపురం టెంపుల్.. దీన్నే మహాబలిపురం అంటారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆగ్నేయ భారతాన్ని పాలించింది ఈ పల్లవులేనని చరిత్ర చెబుతోంది. కావేరీ డెల్టా నుంచి చోళులు వచ్చేంత వరకు ఇక్కడ పల్లవ సామ్రాజ్యానిదే ఆధిపత్యం. మహాబలిపురంలోని ఒంపులు తిరిగిన శిల్పాలన్నీ పల్లవుల పాలనను ప్రతిబింబిస్తాయి. ఆనాటి నుంచి ఇప్పటి వరకు శిల్పాలు చెక్కడంపైనే ఆధారపడిన వాళ్లు మహాబలిపురంలో బతుకుతున్నారు. దాదాపు 1300 ఏళ్ల క్రితం నిర్మించిన ఇక్కడి ఆలయాలు, శిల్పాలు.. సముద్రపు అలలు, గాలుల కారణంగా కోతకు గురయ్యాయి. క్రమంగా రూపురేఖలు మాయమవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ఏవో రహస్యాలు తనలో దాచుకున్నట్టుగానే కనిపిస్తాయి.
శ్రావణ బెలగొళ, కర్నాటక
భారత ఉపఖండంలో జైన మతం కూడా వర్ధిల్లుతోంది. అహింసే పరమావధిగా, సన్యాస ధర్మం, పూర్తి శాఖాహారం తీసుకుంటూ జైన మత ధర్మాన్ని ఆచరిస్తున్నారు. కర్నాటకలోని మైసూరుకు దగ్గర్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాన్ని పరమ పవిత్రంగా పూజిస్తారు జైనులు. తొలి జైన తీర్థంకుడి కుమారుడైన గోమటేశ్వరుని భక్తితో పూజిస్తారు. దిగంబర రూపంలో, తల వెంట్రుకల నుంచి కాలి బొటనవేలు గోర్ల వరకు అందంగా చెక్కిన ఈ విగ్రహం 17.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. పుష్కరానికోసారి జరిగే మస్తకాభిషేక పండగ వైభవంగా జరుగుతుంది. పాలు, పెరుగు, మజ్జిగ, చందనం, నాణెలు, రత్నాలతో ఈ విగ్రహాన్ని అభిషేకిస్తారు.
అరుణాచలేశ్వరుడు, తమిళనాడు
పంచభూత లింగాల్లో అగ్ని లింగం అయిన అరుణాచలుడు తమిళనాడులోని తిరువణ్ణామలైలో కొలువై ఉన్నాడు. ఇక్కడ విగ్రహం కంటే కొండనే అత్యంత పవిత్రమైనది. ఈ అరుణాచలమే సాక్షాత్తు పరమశివుడి రూపంగా పూజలు అందుకుంటోంది. తూర్పువైపుగా చూస్తూ త్రీడీ ఆర్కిటెక్చర్ నిర్మాణంగా కనిపిస్తుంది. ఇక అరుణాచలంలోని రాజగోపురాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సర్క్యూట్ బోర్డులోని ఇంటర్ లాకింగ్ వ్యవస్థలాగా, మయన్ పిరమిడ్ను తలపించేలా ఈ నిర్మాణాలు ఉంటాయి. స్వర్గంలోని దేవతలు సైతం తొంగి చూసేలా ఇక్కడి నిర్మాణాలు అబ్బురపరుస్తాయి.
విరూపాక్ష ఆలయం, హంపి, కర్నాటక
విజయనగర సామ్రాజ్యంలో పెద్ద పట్టణంగా విరాజిల్లింది హంపి. ఆరోజుల్లోనే సుమారు 5 లక్షల మంది ఇక్కడ నివసించేవారు. కాని, ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో ఇక్కడి చరిత్ర మొత్తం తుడుచుపెట్టుకుపోయింది. ఇక్కడ దాదాపు 3700 ఆలయాలు, పవిత్ర ప్రదేశాలు ఉండేవి. ఇక ఇక్కడ నిర్మించిచన విఠల టెంపుల్ విజయనగర సామ్రాజ్యాన్ని, అప్పటి నాగరికతను ఇప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది. సప్తస్వరాలను పలికించే స్తంభాలు, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు, సింహం-ఏనుగు కలయికలో ఉండే యాలి అనే జంతువు, విష్ణు మూర్తిని స్వర్గానికి తీసుకుపోయే రాతితో చెక్కిన రథం.. ఇలా ప్రతి ఒక్క కట్టడం అబ్బురపరుస్తాయి.
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, తిరుమల, ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి దర్శనం అంత సునాయాసంగా దొరకదు. ఎంతోకొంత పుణ్యం చేసుకుని ఉండాలి. భక్తులు దాదాపు 3500 మెట్లు ఎక్కి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆ దేవదేవున్ని కొలుస్తారు. తిరుపతి నుంచి తిరుమల కొండకు కాలిబాట 15 కిలోమీటర్లు ఉంటుంది. కొండ కింద నుంచి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ.. చాలా మంది భక్తులు తమ మొక్కులో భాగంగా కాలినడకన తిరుమల చేరుకుంటారు. ఏడాదిలో తిరుమలేశుని దర్శనం కోసం నాలుగు కోట్ల మంది భక్తులు వస్తుంటారు. ఆనందనిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుని చూడడం కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడి మరీ స్వామివారిని దర్శించుకుంటుంటారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు వచ్చే పరమపవిత్ర క్షేత్రంగా తిరుమల విరాజిల్లుతోంది.
దక్షిణాది ముఖద్వారాలుః
దక్షిణాదిలోని ప్రముఖ ప్రాంతాలకు రావాలంటే ముంబయి నుంచి సౌకర్యవంతమైన ప్రయాణమార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నైలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండడంతో నేరుగా చేరుకోవచ్చు. కర్నాటకలోని ముఖ్యమైన ప్రదేశాలు చూడాలనుకునే వారికి బెంగళూరు ఎయిర్ పోర్టు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు పుణ్యక్షేత్రాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్లేందుకు రోడ్డు, రవాణా మార్గాలున్నాయి. ఇక చెన్నైలో ల్యాండ్ అయితే.. అక్కడి నుంచి రోడ్, రైల్వే, ఎయిర్ కనెక్టివిటీ ద్వారా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
Tags
Related News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.