Kerala : కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి
- Author : Prasad
Date : 27-05-2026 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
కేరళలో సీపీఐ-ఎం సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం సమీపంలో ఈడీ సోదాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోదాలు ముగిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం వెళ్తుండగా, వాహనాలపై సీపీఐ ఎం కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఈడీ బృందానికి చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో వాహనాల అద్దాలు పగలడంతో డ్రైవర్లు, భద్రతా సిబ్బందికి గాయాలైయ్యాయి. కొంతమంది పోలీసు సిబ్బందికి కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సోదాలు ముగిసిన అనంతరం అక్కడ గుమిగూడిన కొందరు నిరసనకారులు ఈడీ కాన్వాయ్ను అడ్డుకున్నారని… ఆ తరువాత వాహనాలపై రాళ్లు, ఇతర వస్తువులతో దాడి జరిగినట్లు తెలిపారు.
ఈ ఘటన తర్వాత ఈడీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, ఘటనలో పాల్గొన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.