వివాహిత మహిళ బ్లాక్మెయిల్.. బెంగళూరు ఫిట్నెస్ ట్రైనర్ ఆత్మహత్య
- Author : Vamsi Chowdary Korata
Date : 13-04-2026 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత వేధింపులు, బ్లాక్మెయిలింగ్ తాళలేక 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రస్థాయి ఫిట్నెస్ ట్రైనర్ అయిన దిలీప్ (28) రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ తర్వాత యోగిత అనే మహిళ నుంచి దిలీప్ సోదరికి ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది. దిలీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ మెసేజ్లో ఉండటంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే గది తలుపులు బద్దలుకొట్టి చూడగా, దిలీప్ విగతజీవిగా కనిపించాడు.
కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. దిలీప్కు జిమ్లో 42 ఏళ్ల వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చనువుగా మారడంతో, ఆమె డబ్బు, ఆస్తి కోసం దిలీప్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. గతంలో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగా, ఆమె భర్త సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆపలేదని, నిరంతరం వేధించడంతోనే దిలీప్ ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబం ఆరోపిస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.