Actress Hema : రేవ్ పార్టీ కేసు విచారణకు హేమ డుమ్మా.. వైరల్ ఫీవర్ ఉందంటూ లేఖ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ జరిగిన బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణకు టాలీవుడ్ నటి హేమ గైర్హాజరయ్యారు.
- Author : Pasha
Date : 27-05-2024 - 12:57 IST
Published By : Hashtagu Telugu Desk
Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ జరిగిన బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణకు టాలీవుడ్ నటి హేమ గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత టైం ఇవ్వాలని కోరుతూ ఆమె పోలీసులకు లేఖ రాశారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే హేమ రాసిన లేఖను బెంగళూరు పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలని మరోసారి హేమకు నోటీసులు జారీ చేస్తారని సమాచారం.
ఇక ఇవాళ విచారణకు హేమ(Actress Hema) సహా 8 మందిని పోలీసులు పిలిచారు. ఎవరైతే హాజరయ్యారో.. వారిని ఇంటరాగేట్ చేసినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ నిర్వాహకుల గురించి.. దానితో ముడిపడిన లావాదేవీల గురించి.. డ్రగ్స్ సప్లై గురించి పోలీసులు ఆరా తీశారని అంటున్నారు. ఇక ఇదే కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. బెంగళూరు నగర శివార్లలో జరిగిన ఈ రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ పరీక్షలో వెల్లడైంది. ఈ లిస్టులో నటి హేమ కూడా ఉన్నారు.
Also Read : Doctors Arrest : ర్యాష్ డ్రైవింగ్ కేసు.. బాలుడి బ్లడ్ శాంపిల్ను మార్చేసిన డాక్టర్లు అరెస్ట్
సాధారణంగా రేవ్ పార్టీలలో పాల్గొన్న వారిని, ఆ పార్టీలలో డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తుంటారు. నటి హేమకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసే అవకాశమే ఉంది. ఒకవేళ హైదరాబాద్లో జరిగే రేవ్ పార్టీలలో దొరికితే వెంటనే విషయం మీడియాలో టాంటాం అయిపోతుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగే రేవ్ పార్టీలలో దొరికిపోయినా.. ఈజీగా కౌన్సెలింగ్ తీసుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చేయొచ్చు అనే భావనలో కొందరు ఉన్నారు. అందుకే రేవ్ పార్టీలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ నిబంధనలను కఠినతరం చేసి.. రేవ్ పార్టీలలో దొరికేవారికి కూడా కఠిన శిక్షలు విధిస్తేనే పరిస్థితులు మారుతాయని పరిశీలకులు అంటున్నారు.