Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..డిసెంబర్ 28 రాత్రి నుంచి?
కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 28 రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
- By Hashtag U Published Date - 06:54 PM, Sun - 26 December 21

కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 28 రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన సీనియర్ మంత్రులు, అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 28 నుండి దాదాపు పది రోజుల పాటు, రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ సెక్షన్ 144 అమలు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారతదేశం అంతటా పెరుగుతూనే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 400 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.వీటిలో కర్ణాటకలో 31 కేసులు నమోదుకాగా…15 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు
రాష్ట్రవ్యాప్తంగా సామూహిక బహిరంగ సభలు, వేడుకలు నిషేధించున్నారు. డిసెంబర్ 28 నుండి అన్ని సమావేశాలు, వివాహాలతో సహా పాల్గొనే వారి సంఖ్యను ఖచ్చితంగా పరిమితం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తినుబండారాలు, హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు,రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే కలిగి ఉండేలని ప్రభుత్వం తెలిపింది. రాత్రి కర్ఫ్యూ సమయంలో అవసరమైన కార్యకలాపాలు, రోగులు వారి అటెండెంట్లు, పరిశ్రమలు, రాత్రి కార్యకలాపాలు అవసరమయ్యే కంపెనీలు, సరుకులను తీసుకెళ్లే వాహనాలు, బస్సులు, రైళ్లు, మెట్రో, విమాన ప్రయాణం, హోమ్ డెలివరీ, ఇ-కామర్స్ కార్యకలాపాలు మినహా మిగిలిన వ్యక్తులకు అనుమతి ఉండదని ప్రభుత్వం తెలిపింది.రాత్రి షిఫ్టులలో పనిచేసే కంపెనీల ఉద్యోగులు ఐడీకార్డులతో తమ ఆఫీసులకు వెళ్లాలని పేర్కొంది. దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ప్రయాణ టికెట్లను చూపించాలని….బస్సు, రైళ్లు మరియు విమానంలో ప్రయాణ నిమిత్తం ప్రయాణికుల తరలింపు అనుమతి ఉంటుందని తెలిపింది.
ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర కోవిడ్ -19 టాస్క్ఫోర్స్తో చర్చలు జరిపారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, వివాహాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో పార్టీల సమయంలో రద్దీని నివారించడానికి మార్గాలను చర్చించారు. ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు దృష్ట్యా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వివాహాలకు అనుమతించే వ్యక్తుల సంఖ్యను 200కి పరిమితం చేసింది.