Annamalai: బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..
- Author : Vamsi Chowdary Korata
Date : 02-06-2026 - 9:21 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై పార్టీని వీడి సొంత రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. జూన్ 15వ తేదీలోగా ఆయన తన కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిణామాలపై చర్చించేందుకు ఆయన నిన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై తన నిర్ణయాన్ని సామరస్యపూరకంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఈ ఎన్నికల సమయంలో ఏఐఏడీఎంకేతో పొత్తు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాల్లో అధిష్ఠానంతో అన్నామలైకి భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో తనకు తగిన అవకాశాలు లభించడం లేదని, అందుకే రాజ్యసభ సీటును కూడా తిరస్కరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టాలంటూ పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఊహాగానాలపై అన్నామలై నేరుగా స్పందించలేదు. “దయచేసి రెండు రోజులు ఆగండి. కూర్చుని మాట్లాడుకుందాం” అని పేర్కొనడంతో ఆయన తదుపరి అడుగులపై మరింత ఉత్కంఠ నెలకొంది.
‘వి ది లీడర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజల్లోకి వెళ్తూ, ‘ద్రవిడ 2.0’ పేరుతో లౌకిక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలని అన్నామలై యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన రాజీనామా వార్తలపై బీజేపీ అధిష్ఠానం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.