Wayanad : వయనాడ్ విలయం..88కి చేరిన మృతులు..రెండు రోజులు సంతాప దినాలు
కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మలలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది.
- By Latha Suma Published Date - 04:58 PM, Tue - 30 July 24

Wayanad Landslides: కేరళ(Kerala)లోని వయనాడ్ జిల్లాలో భారీగా కొండచరియల విరిగిపడన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ దాదాపు 88 మంది మరణించారు. 116 మంది తీవ్ర గాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం కాపాడారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది. ఈ ప్రమాదంలో వందలాది మంది మట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయారు. పదుల సంఖ్యలో మృతదేహాలను 30 కిలోమీటర్ల అవతల ఉన్న చలయార్ నదిలో తేలియాడుతుండగా పోలీసులు గుర్తించారు. ముండకై తేయాకు పరిశ్రమ పనిచేస్తున్న ఆరు వందల మంది కార్మికులు గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటి దాక కార్మికుల జాడ తెలియలేదు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, వరదల ధాటికి సెల్ ఫోన్ టవర్స్ కొట్టుకొని పోవడంతో వారు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అస్సాం, పశ్చిమబెంగాల్ నుండి వచ్చి తేయాకు తేటలో వారు పనిచేస్తున్నారు. వరదలకు టీ ఎస్టేట్ పూర్తిగా కొట్టుకుని పోయింది. కాగా.. ఇప్పటి వరకు 146 మందిని రెస్క్యూ టీం కాపాడింది. నాలుగు గ్రామాల్లో దాదాపు 1200 వరకు రాళ్ళ కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన జనాలను బయటకు తీసుకురావడానికి ఎన్డిఆర్ఎఫ్తో సహా పలు ఏజెన్సీలు, సైన్యం సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.