Covid 19 Alert : కరోనా వైరస్పై రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలివీ..
Covid 19 Alert : జేఎన్ - 1 కరోనా వైరస్ సబ్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
- Author : Pasha
Date : 20-12-2023 - 12:51 IST
Published By : Hashtagu Telugu Desk
Covid 19 Alert : జేఎన్ – 1 కరోనా వైరస్ సబ్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలు, రోగులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రుల సన్నద్ధతపై రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఈసందర్భంగా ఆయన రాష్ట్రాలకు సూచించారు. ‘‘ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన విషయమిది. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని మన్సుఖ్ మాండవీయ(Covid 19 Alert) చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
పండుగ సీజన్తో పాటు చలి కాలం ఉన్నందున ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆయన నిర్దేశించారు. అయితే జేన్.1 కరోనా వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జేన్.1 కరోనా వేరియంట్ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించింది. అది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపింది.
Also Read: White Paper : తెలంగాణ ఆర్థికస్థితిపై శ్వేతపత్రం రిలీజ్
తెలంగాణలో సైతం కొత్తగా 4 కరోనా కేసులు వెలుగు చూశాయి. మంగళవారం 402 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 9 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే వీరిలో ఎంతమందికి కొత్త వేరియంట్ ఉందనేది ఇంకా తేలాల్సి ఉంది. అటు కేరళలో కొత్త వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 115 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1749కు చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 142 కేసులు నమోదు కాగా అందులో 115 కేరళ నుంచే కావడం గమనార్హం. కేరళలో వెలుగు చూసిన జేఎన్ – 1 కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో విస్తరిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం సింగపూర్లో ఇది చాలా ఉధృతంగా వ్యాపిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో అక్కడ 56 వేల కేసులు నమోదయ్యాయి. దాంతో సింగపూర్లోని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. కేసుల సంఖ్య ఇంకా పెరిగితే లాక్డౌన్ విధిస్తామని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు మలేషియాలో కూడా జేఎన్ – 1 కరోనా వేరియంట్ వల్ల 20 వేల కేసులు నమోదయ్యాయి.