Pahalgam Terror Attack : సర్జికల్ స్ట్రైక్స్ ..పాకిస్థాన్లో గుబులు స్టార్ట్ ?
Pahalgam Terror Attack : భారత్ గతంలో 2016లో ఉరి దాడికి కౌంటర్గా, 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోటపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి, పాక్కు బలమైన సంకేతం పంపింది
- By Sudheer Published Date - 06:23 AM, Thu - 24 April 25

జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strike ) చేపట్టే అవకాశాలపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం పాకిస్థాన్పై కఠిన ప్రతీకారం తీర్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. భారత్ గతంలో 2016లో ఉరి దాడికి కౌంటర్గా, 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోటపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి, పాక్కు బలమైన సంకేతం పంపింది. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కూడా అదే తరహాలో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు చూసి పాకిస్థాన్ (Pak) లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. ISI (ఇంటెలిజెన్స్ సర్వీస్) హెచ్చరికలతో, పాకిస్థాన్ సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయడానికి ఆర్మీ చర్యలు తీసుకుంటోంది. స్థానిక ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్లో ఎయిర్ఫోర్స్ కూడా పూర్తి అప్రమత్తతను పాటిస్తూ, భారత్ నుండి వచ్చే ఎటువంటి ప్రతీకార చర్యలకు ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Mumbai Indians: ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్!
మరోపక్క ప్రధాని మోదీ (Modi) అధ్యక్షతన అత్యవసరంగా సీసీఎస్ (కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశం నిర్వహించి పాకిస్తాన్పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా భారత్లోకి పాకిస్తాన్ పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ను రద్దు చేశారు. ఇప్పటికే వీసా పొంది దేశంలో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయడం పెద్ద పరిణామంగా మారింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయకపోతే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక డిప్లమాటిక్ స్థాయిలో కూడా భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులను వారంలోపుగా వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. అదే విధంగా ఇస్లామాబాద్లో ఉన్న భారత హై కమిషన్ సలహాదారులను వెనక్కి రప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. అట్టారీ చెక్పోస్ట్ మూసివేతతో పాటు, అక్కడి గుండా భారత్లోకి వచ్చిన వారు మే 1లోపు వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ చర్యలతో పాకిస్తాన్పై భారత్ బిగ్ షాక్ ఇచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలతో పాక్ కోలుకోవడం కష్టమే అని..ఇదే కాదు ముందు ముందు ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోని పాక్ ను అన్ని విధాలా దెబ్బతీయాలని దేశ ప్రజలంతా కోరుతున్నారు.