PM Modi: రెండుసార్లు ప్రధాని పదవితో సరిపెట్టుకునే తత్వం తనది కాదన్న మోదీ.. మరోసారి పీఎం పదవిపై…!
ప్రధాని మోదీ తీరే డిఫరెంట్ గా ఉంటుంది. నేతలను ఆయన ట్రీట్ చేసే విధానం కూడా అంతే.
- Author : Hashtag U
Date : 13-05-2022 - 9:48 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాని మోదీ తీరే డిఫరెంట్ గా ఉంటుంది. నేతలను ఆయన ట్రీట్ చేసే విధానం కూడా అంతే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం.. జాతీయస్థాయిలో విజయవంతంగా పావులు కదపడంతో తోడ్పడుతోంది. అదే క్రమంలో రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకునే రకం కాదన్న ధోరణి ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఈమధ్య ఆయనను కలిసి ఓనేతతో జరిగిన సంభాషణను మోదీ చెప్పుకొచ్చారు.
గుజరాత్ లోని బారుచ్ లో ప్రభుత్వ కార్యక్రమంలో వర్చువల్ లో పాల్గొన్నారు మోదీ. వృద్దులతోపాటు వితంతువులు, పేదవారితో జరిగిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీరికోసం ప్రవేశపెట్టిన పథకాలను నూటికి నూరుశాతం అమలు చేసిన క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో మోదీ మాట్లాడారు. ఈమధ్యనే తనను ఓ నేత కలిశారని.. దేశం రెండుసార్లు ప్రధానిని చేసిందని ఇంకా ఏం కావాలని తనను అడిగారన్నారు.
రెండుసార్లు ప్రధానిగా చేస్తే జీవితంలో అన్నీ పొందినట్టే అనే ఫీలింగ్ ఆ నేత మాటల్లో వ్యక్తమైందన్నారు మోదీ. కానీ మోదీ మిగిలిన నేతలకన్నా డిఫరెంటని.. గుజరాత్ గడ్డపై పెరిగానని అందుకే దేనిని అంత తేలికగా తీసుకోనని అన్నారు. సంక్షేమ పథకాలు వందశాతం లబ్దిదారులకు చేరేలా చూడడమే తన స్వప్నమన్నారు. అప్పటివరకు విశ్రాంతి తీసుకోనన్నారు. దీనిని బట్టి మోదీ తన మనసులో మాట బయటపెట్టినట్టయ్యింది.
2014లో ప్రధాని అయిన మోదీ.. 2019 ఎన్నికల్లో గెలవడంతో మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో ఈసారి బీజేపీ వీటిని ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. అందుకే మూడోసారి బీజేపీ గెలుపు అంత సాఫీగా సాగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అందుకే మరోసారి మోదీ ప్రధాని అయ్యే కల నెరవేరుతుందా లేదా అన్నది 2024లో తేలిపోతుంది.