Scoot airline: ప్రయాణికులకు షాక్.. 35 మందిని వదిలిపెట్టి వెళ్లిన విమానం!?
ఈ మధ్యన విమానయాన సంస్థలు ప్రయాణికులు ఎక్కారా లేదా అని పట్టించుకోకుండానే ఎగిరిపోతున్నాయి.
- By Nakshatra Published Date - 07:36 PM, Thu - 19 January 23
Scoot airline: ఈ మధ్యన విమానయాన సంస్థలు ప్రయాణికులు ఎక్కారా లేదా అని పట్టించుకోకుండానే ఎగిరిపోతున్నాయి. బెంగళూరులొ గో ఫస్ట్ విమానం 50 మంది ప్రయాణికులు ఎక్కడానికి ముందే ఎగిరిపోవడం వార్తల్లో నిలిచింది. ఇది మరువక ముందే మరో విమానయాన సంస్థకు చెందిన విమానం.. 35 మంది ప్రయాణికులు ఎక్కడానికి ముందే అది ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే నిరసనకు దిగారు.
బుధవారం సాయంత్రం 7.55గం.లకు అమృత్ సర్ విమానాశ్రయం నుండి స్కూట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. కానీ ఆ విమానం మధ్యాహ్నం గం.3లకే వెళ్లిపోయింది. దీంతో తమకిచ్చిన టైంకు వచ్చిన ప్రయాణికులు షాక్ తిన్నారు. తాము లేకుండానే విమానం ఎలా వెళ్లిపోయిందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేష్ (DGCA)కు ఫిర్యాదు చేయగా.. విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే ఈ ఘటనపై అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ స్పందిస్తూ.. ‘ఆ విమానంలో మొత్తం 280 మందికి పైగా సింగపూర్ ప్రయాణించాల్సి ఉంది. 250 మందికి పైగా రీషెడ్యూల్ ప్రకారం వెళ్లిపోయారు. సుమారు 30 మంది మిగిలిపోయారు’ అని వివరించారు. కాగా 35 మంది ఒకే ఏజెంట్ దగ్గర టికెట్స్ బుక్ చేసుకున్నారని, మారిన సమయం గురించి ఏజెంట్ సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది వివరించింది.
ఇక స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం విషయంలో జరిగిన ఘటనపై జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందించారు. ‘షెడ్యూల్ మార్పు వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు కనిపిస్తోంది. కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు కస్టమర్ల కాంటాక్ట్ సమాచారాన్ని పంపకుండా, వారి ఏజెన్సీ ఇ-మెయిల్, ఫోన్ నెంబర్లను మాత్రమే ఇస్తారు. అలాంటప్పుడు విమాన ప్రయాణ సమయాలు మారినప్పుడు కస్టమర్లకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వారిదే. ఇది ఎన్నాళ్లుగానో విమానయాన సంస్థలను వేధిస్తున్న సమస్య. దురదృష్టవశాత్తు, ఏజెంట్లు కస్టమర్ల సమాచారమే ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. ఆ దిశగా నిబంధన ఉంటేనే ఇలాంటి సమస్యలు నివారించవచ్చు’ అని ఆయన అన్నారు.