‘Note For Vote’ Case : ఓటుకు నోటు కేసు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన సుప్రీం
ఓటుకు నోటు కేసు ట్రయల్ ను భోపాల్ కు మార్చాల్సిన అవసరం ఏముందని జగదీశ్ రెడ్డి లాయర్లను బెంచ్ ప్రశ్నించింది.
- By Latha Suma Published Date - 02:50 PM, Mon - 22 July 24

‘Note For Vote’ Case : ఓటుకు నోటు కేసు విచారణలో కీలక పరిణామం సంభవించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(BRS MLA Jagadish Reddy)ఈ కేసు ట్రయల్ను హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఈ పిటిషన్ పై ఈరోజు(సోమవారం) జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఓటుకు నోటు కేసు ట్రయల్ ను భోపాల్ కు మార్చాల్సిన అవసరం ఏముందని జగదీశ్ రెడ్డి లాయర్లను బెంచ్ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎం అయితే కోర్టులు ఎలా ప్రభావితం అవుతాయని అడిగింది. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై కేసులు నమోదైతే వాటిని పొరుగుదేశం పాకిస్థాన్ కు మార్చాలా? అంటూ సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే దీనికి జగదీర్ రెడ్డి( Jagadish Reddy)లాయర్లు సమాధానమిస్తూ..ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం వల్ల ప్రాసిక్యూట్ చేసే ఏజెన్సీలు తమ అభిప్రాయం, వాదన మార్చుకునే అవకాశం ఉందని వివరించారు. కేసులో కీలకమైన ఆధారాలను తారుమారు చేయవచ్చని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు రిజాయిండర్ వేసేందుకు తమకు సమయం కావాలని జగదీశ్ రెడ్డి లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టును ఓటుకు నోటు కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.