Pawan Mania : పవన్ లోకల్ కాదు.. నేషనల్ ..మరి పట్టించుకోవడం లేదేంటి..?
Pawan Mania : జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత గురించి ఎక్కడా చెప్పడం లేదు. మహారాష్ట్రలో చారిత్రక విజయానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ ఎలా కారణమో.. అలాగే మహారాష్ట్రలో ప్రభంజనానికి కూడా పవన్ కళ్యాణ్ ఓ కారణం
- By Sudheer Published Date - 07:00 AM, Sun - 24 November 24

పవర్ స్టార్ , జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సత్తా ఏంటో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ లోకల్ అంటూ మొన్నటి వరకు మాట్లాడుకున్న సినీ జనాలు, రాజకీయ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే లోకల్ కాదు నేషనల్ అని గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ జాతీయ మీడియా మాత్రం పవన్ కళ్యాణ్ ను పట్టించుకోవడం పై ఆయన అభిమానులు , జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో (Maharashtra Elections) మహాయుతి ప్రభంజనం (Mahayuti alliance) సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ సాధించడం తో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి హావ నడుస్తుందని..ప్రజలంతా బిజెపినే కోరుకుంటున్నారని మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో రుజువైంది.288 స్థానాలకుగాను అధికార కూటమి 233 స్థానాల్లో విజయం సాధించగా.. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరుఫున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లాతూర్, షోలాపూర్ సహా పలుచోట్ల మహాయుతి కూటమి అభ్యర్థుల తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. బహిరంగసభలతో పాటుగా ర్యాలీలలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఇంత జరిగినా కూడా జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ను పట్టించుకోవడం లేదని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
“జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత గురించి ఎక్కడా చెప్పడం లేదు. మహారాష్ట్రలో చారిత్రక విజయానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ ఎలా కారణమో.. అలాగే మహారాష్ట్రలో ప్రభంజనానికి కూడా పవన్ కళ్యాణ్ ఓ కారణం. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఇంత ఘన విజయాన్ని ఎవరూ ఊహించలేదు. అందరూ 150 వరకూ అంచనా వేశారు. కానీ అక్కడ అద్భుతం జరిగింది. ఆ అద్భుతానికి కారణం ఎవరని జాతీయ మీడియా ఎందుకు ఆలోచించడం లేదు?” అంటూ జనసేన నేత బొలిశెట్టి ప్రశ్నించారు.
“జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి కూడా ఎందుకు సంకోచిస్తోంది? దీని వెనుక ఏమైనా విదేశీ హస్తం ఉందా? నాకు అనుమానం వస్తోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని చాలా దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. సోషల్ మీడియా లేకపోతే మహారాష్ట్రలో ఈ ప్రభంజనం వచ్చేది కాదు. లాతూర్, షోలాపూర్లలో జరిగిన పవన్ కళ్యాణ్ ర్యాలీలను యూట్యూబ్లలో పెట్టారు. ఈ వీడియోలు చూసి, అక్కడకు వచ్చిన జనాలను చూసే ఈ ప్రభంజనం వచ్చింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్కు బ్రహ్మరథం పట్టడాన్ని అక్కడి సోషల్ మీడియా ప్రజలకు చూపించింది. అందుకే ఈ ప్రభంజనం. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికైనా మీడియా చూపించాలి.” అని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
జాతీయ మీడియా మహా ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావాన్ని గురించి మాట్లాడడం లేదు!!
కానీ మహరాష్ట్ర ప్రజలు కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టడాన్ని సోషల్ మీడియా ప్రజలకు కళ్ళకి కట్టినట్టు చూపించింది.. మొత్తం మహారాష్ట్ర ప్రజల్లో అవగాహన కల్పించి జాతీయ మీడియా చేస్తున్న ఉకదంపుడు దిబెట్లు… pic.twitter.com/f962Zfu6iS
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) November 23, 2024
Read Also : Maharashtra Election Result: మహారాష్ట్రలోని ఈ 5 స్థానాల్లో 300 నుంచి 3000 ఓట్ల తేడాతో గెలుపు ఓటములు!