LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 9:41 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 4కు పరిమితం చేస్తున్నట్లు సోమవారం ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పేద కుటుంబాల సగటు వాడకానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
2016 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. తొలినాళ్లలో ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వగా, గత ఏడాది దాన్ని 9కి తగ్గించారు. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 4కు కుదించారు. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ ఖనూజా మాట్లాడుతూ.. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగం దాదాపు నాలుగు సిలిండర్లగానే ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
శుభ్రమైన వంట ఇంధనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, మే 2022లో కేంద్రం ఒక్కో సిలిండర్పై రూ. 200 సబ్సిడీని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 2023లో ఆ సబ్సిడీని రూ. 300కు పెంచింది. లబ్ధిదారులు సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత ఈ సబ్సిడీ మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఇటీవల వంట గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ కోత విధించడం గమనార్హం. గత మూడు నెలల్లో రెండుసార్లు ధరలు పెరిగి, ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 942కు చేరింది. రూ. 300 సబ్సిడీ పోగా, ఉజ్వల లబ్ధిదారులు ప్రస్తుతం రూ. 642 చెల్లిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఖనూజా తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరిగాయని, ఒక్కో సిలిండర్ సరఫరాకు ప్రభుత్వానికి రూ. 1,600 పైగా ఖర్చవుతోందని ఆయన వివరించారు. అంటే, సబ్సిడీ తర్వాత కూడా ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై సుమారు రూ. 1,000 భరిస్తోందని పేర్కొన్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల చమురు కంపెనీలు ఒక్కో ఎల్పీజీ సిలిండర్పై సుమారు రూ. 700 నష్టపోతున్నాయని తెలిపారు.
కేవలం ఎల్పీజీపైనే కాకుండా, పెట్రోల్, డీజిల్పై కూడా చమురు కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయని ఆయన అన్నారు. పెట్రోల్పై లీటర్కు రూ. 6, డీజిల్పై లీటర్కు రూ. 30 వరకు నష్టం వస్తోందని, మొత్తంగా రోజుకు రూ. 600-700 కోట్ల నష్టాలు వస్తున్నాయని ధరల పెంపునకు గల కారణాలను వివరించారు. 2022 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీల రూపంలో రూ. 52,000 కోట్లు అందించిందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, భారత్లోనే వంటగ్యాస్ అత్యంత తక్కువ ధరకు లభిస్తోందని అన్నారు.