Old Parliament History : భగత్సింగ్ విప్లవ పోరాటానికి చిహ్నం ..ఇప్పుడు పాతదైంది
96 ఏళ్ల ఘన చరిత్ర పాత పార్లమెంట్ సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్ గా నిలిచింది. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన గొప్ప వేదిక
- By Sudheer Published Date - 08:46 PM, Mon - 18 September 23

భగత్సింగ్ (Bhagat SIngh) విప్లవ పోరాటానికి చిహ్నంగా నిలిచిన భారత పార్లమెంటు భవనం (Old Parliament ) ఇప్పుడు పాత పార్లమెంటు భవనంగా మారిపోయింది. రేపటి నుండి కొత్త పార్లమెంట్ (New parliament) లో సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈరోజు సమావేశాలు పాత బిల్డింగ్లోనే జరిగాయి. రేపటి నుంచి(సెప్టెంబర్ 19న) కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అవుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. జూన్1వ తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని ప్రారంభించారు. మోడీ తో పాటు లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
ఇక పాత పార్లమెంట్ భవనం (Old Parliament History ) విషయానికి వస్తే..ఈ పాత పార్లమెంట్ భవనానికి ఘన చరిత్ర ఉంది. స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో భగత్ సింగ్ రిగిల్చిన పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం పాత పార్లమెంట్ భవనం. ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో తీపి అనుభూతులు.. చేదు ఘటనలు.. బాంబు దాడులు.. నిరసనలు.. గొడవలు.. కొట్లాటలు..ఇలా ఎన్నో పాత పార్లమెంట్లో జరిగాయి.
ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ “హెర్బర్ట్ బేకర్” 1912-13 లో డిజైన్ చేశాడు. 1921 నుండి ఆరేళ్ళ పాటు దీని నిర్మాణం కొనసాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షల ఖర్చు అయింది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన చారిత్రాత్మక ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ(tryst with destiny)’ ప్రసంగంతో దేశం పునర్జన్మ పొందింది. బానిస సంకేళ్లను తెంచుకుంటూ స్వేచ్ఛ ప్రపంచంలోకి ఇండియా అడుగుపెట్టిన తొలి రోజు నుంచి దేశాన్ని ముందుండి నడిపిస్తోన్న పాత పార్లమెంట్ భవనానికి భారత్ అధికారికంగా వీడ్కోలు పలికింది. కొత్త పార్లమెంట్ భవనం నుంచే ఇకపై దేశం ముందడుగులు వేయనుంది.
96 ఏళ్ల ఘన చరిత్ర పాత పార్లమెంట్ సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్ గా నిలిచింది. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన గొప్ప వేదిక. అలాంటి ఈ వేదిక స్థానంలో కొత్త భవనం రూపుదిద్దుకొన్నది. కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మే 28న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
భగత్సింగ్ విప్లవ పోరాటానికి చిహ్నంగా పాత పార్లమెంట్ (Old Parliament History) నిలిచింది..
1929లో ఏప్రిల్ 8న విప్లవకారులు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్లతో బ్రిటిష్ రాజ్ హయాంలోని పాత పార్లమెంటు చాంబర్లు వణికిపోయాయి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA) నుంచి ‘చెవిటివారికి వినిపించడానికి పెద్ద గొంతు కావాలి’ అనే సందేశంతో విజిటర్స్ గ్యాలరీల నుంచి ఈ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు ఎర్ర కరపత్రాలను విసిరారు. సర్ జాన్ ఆల్సెబ్రూక్ సైమన్ ఛాంబర్లో ఉన్న సమయంలో భగత్సింగ్, దత్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. సైమన్ కమిషన్కు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ‘సైమన్ గో బ్యాక్’ ఆ సమయంలో భారత్కు ఉద్యమ నినాదం. నిజానికి సైమన్పై దాడి చేయలన్నది భగత్సింగ్ ఉద్దేశం కాదు. ప్రజలను మేల్కొలపాలన్నదే ఆయన ఆలోచన. ఈ ఘటన తర్వాత భగత్సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు. పాలనా వ్యవస్థను మార్చడానికి ఇది ప్రభుత్వానికి ప్రమాద సంకేతం మాత్రమేనని పత్రికలు విప్లవకారులను కీర్తించాయి. తమ ఉద్యమాన్ని, భావజాలాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి ట్రయల్ కోర్టును ప్రచార వేదికగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భగత్సింగ్ అమరుడయ్యాడు.
2001 లో పార్లమెంట్పై దాడి (Attack on Parliament ):
పాత పార్లమెంట్ భవనం ఉగ్రదాడులను కూడా భరించింది. డిసెంబర్ 13, 2001న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్టిక్కర్లతో కూడిన వైట్ అంబాసిడర్లలో భారత పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించాయి. ఏకే-47 ఆయుధాలు, గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంచర్లు, హ్యాండ్ గన్లతో ఉగ్రవాదులు భద్రతా బందోబస్తును ఛేదించారు. ఎంపీలందరూ సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ, ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా అధికారులు సహా తొమ్మిది మంది మరణించారు. 18 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి దుస్తులు ధరించిన దుండగుల్లో ఒకరిని కాల్చి చంపిన తర్వాత అతని బాంబు పేలడంతో అతడు మృతి చెందాడు. మరో నలుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
పాత పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు (Features of Old Parliament of India) ఓసారి చూస్తే..
- 1927 జనవరి 18న పార్లమెంట్ భవనాన్ని అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు.
1956లో మరో రెండు అంతస్థులను నిర్మించారు.
2006లో పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇందులో 2,500 నాటి భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వం కనిపిస్తుంది.
ఆరు ఎకరాల్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే విలక్షణమైనదిగా ప్రసిద్ధి పొందింది.
స్వతంత్ర భారతదేశంలో తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఇదే భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగింది. 1949 నవంబర్ 26న భారత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది.
వలస పాలన, రెండో ప్రపంచ యుద్ధం, స్వాంతంత్య్ర ఉషస్సు, రాజ్యాంగ ఆమోదంలాంటి మైలురాళ్లకు ఇది సాక్షీభూతంగా నిలిచింది.