NDA Bihar : బిహార్లో ‘పొత్తు’ పొడిచింది.. బీజేపీకి 17, జేడీయూకు 16
NDA Bihar : ఎన్నికల సమరం కోసం అశోకుడి జన్మభూమి బిహార్ రెడీ అవుతోంది.
- Author : Pasha
Date : 18-03-2024 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
NDA Bihar : ఎన్నికల సమరం కోసం అశోకుడి జన్మభూమి బిహార్ రెడీ అవుతోంది. ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గానూ బీజేపీ 17, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 16 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం. ఎల్జేపీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలు ఒక్కో స్థానంలో పోటీ చేస్తాయని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు ఫార్ములాపై జేడీయూ నేత లలన్ సింగ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ కుమార్ ఝాతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ అంతర్గతంగా చర్చించారు. దీనిపై బీజేపీ నేతలతో చర్చించేందుకు సీఎం నితీశ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి వచ్చాక సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. బిహార్లోని ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్కు చెందిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్జేపీ), హిందుస్థాన్ అవామీ మోర్చా(హెచ్ఏఎం), లోక్ మోర్చా(ఆర్ఎల్ఎం) పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఇందులో ఆర్ఎల్జేపీకి రాజ్యసభ సీటుతో పాటు ఒక మంత్రి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లో(NDA Bihar) బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ ఆరుస్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి హాజీపూర్ సెగ్మెంట్పై పరాస్, ఆయన మేనల్లుడు చిరాగ్ పాశ్వాన్ మధ్య పోటీ నెలకొంది. ఈసీటును పాశ్వాన్కు కేటాయిస్తున్నట్టు వార్తలు రావడంతో పరాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూడా క్లారిటీ వచ్చిందని త్వరలోనే సీట్ షేరింగ్ పై ప్రకటన ఉంటుందని జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా వెల్లడించారు.
Also Read :Vote From Home : ఈ ఎన్నికల్లో ‘‘ఓట్ ఫ్రమ్ హోమ్’’.. అర్హత ఏమిటి ? అప్లై ఎలా ?
‘ఇండియా’ పార్టీల సీట్ల సర్దుబాటు ఇలా..
ఇక ఇండియా కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్, సీపీఐఎంఎల్, సీపీఐ, సీపీఎంలు ఉన్నాయి. సీట్ల పంపకంలో భాగంగా ఆర్జేడీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 9 చోట్ల, సీపీఐఎంఎల్ రెండు సెగ్మెంట్లలో, సీపీఐ ఒక స్థానంలో పోటీ చేయనున్నట్టు తెలిసింది. 2019లో కాంగ్రెస్ ఒక కిషన్ గంజ్ స్థానంలో మాత్రమే గెలిచింది. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో సమావేశం జరగనుంది.