Bangladesh News: బంగ్లాదేశ్లో నిరసన జ్వాలలు, 30 మంది మృతి
బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా ఆదివారం మాట్లాడుతూ నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులేనని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
- By Praveen Aluthuru Published Date - 07:05 PM, Sun - 4 August 24

Bangladesh News: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కారులు అల్లర్లు సృష్టించారు. ఈ క్రమంలో నిరసన కారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ రోజు ఆదివారం జరిగిన ఘర్షణల్లో 32 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారత తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ కోరింది. దీనితో పాటు విద్యార్థులతో సహా భారతీయులందరూ అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్ నంబర్ +88-01313076402ను సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘సహకార నిరాకరణ కార్యక్రమం’లో పాల్గొనేందుకు నిరసనకారులు వచ్చారు. అవామీ లీగ్, ఛత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు వారిని వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ కోరుతూ అదేవిధంగా ఇటీవల జరిగిన నిరసనలలో మరణించిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తొలిరోజు కూడా రాజధానిలోని సైన్స్ ల్యాబ్ కూడలి వద్ద ఆందోళనకారులు గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా ఆదివారం మాట్లాడుతూ నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులేనని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఉగ్రవాదులను కఠినంగా అణచివేయాలని దేశప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రధాని అన్నారు. ఈ సమావేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) మరియు ఇతర ఉన్నత భద్రతా అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి భద్రతా సలహాదారు, హోంమంత్రి కూడా పాల్గొన్నారు.
పోలీసులు మరియు విద్యార్థి నిరసనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ హింస జరిగింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో యోధుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన వివాదాస్పద కోటా విధానాన్ని నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: UDF: వయనాడ్కు నెల జీతాన్ని ప్రకటించిన యూడీఎఫ్ ఎమ్మెల్యేలు