CM Yogi Adityanath: మాఫియాకు దడ పుట్టిస్తున్న యోగి..!
మాఫియాను మట్టిలో కలిపేస్తా.. ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య తర్వాత.. రాష్ట్ర అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ (Adityanath) చెప్పిన మాటలివి.
- By Gopichand Published Date - 06:20 AM, Fri - 14 April 23
మాఫియాను మట్టిలో కలిపేస్తా.. ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య తర్వాత.. రాష్ట్ర అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ (Adityanath) చెప్పిన మాటలివి. అన్నట్లుగా.. ఒక్కో నిందితుడిని ఏరిపారేస్తూ యూపీలో మాఫియాను శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్కౌంటర్ దీనికి తాజా ఉదాహరణ. రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించినట్టే ఉత్తరప్రదేశ్లో మాఫియా వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మాఫియాను మట్టిలో కలిపేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసు ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్, ఎస్పీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ను ఎన్కౌంటర్ చేశారు యూపీ పోలీసులు. అతీక్ అహ్మద్తోపాటు మరో నిందితుడు గులామ్ను ఝాన్సీ వద్ద కాల్చిచంపారు యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు. మొత్తం 42 రౌండ్లు కాల్పులు జరిగినట్టు తెలిపారు.
ఘటనాస్థలం నుంచి అధునాతన విదేశీ ఆయుధాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో విచారణ కోసం అతీక్ అహ్మద్ను ప్రయాగరాజ్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అదే సమయంలో అసద్ ఎన్కౌంటర్ వార్త సంచలనం సృష్టించింది. తన కోసమే పోలీసులు అసద్ను ఎన్కౌంటర్ చేశారంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనతోపాటు ఇద్దరు బాడీగార్డ్స్ను పట్టపగలే కాల్చి చంపడం యూపీలో సంచలనం సృష్టించింది. ఆరోజే అసెంబ్లీలో భీష్మప్రతిజ్ఞ చేశారు సీఎం యోగి. ఉత్తరప్రదేశ్లో మాఫియాను మట్టిలో కలిపేస్తామన్నారు.
ఉమేశ్ పాల్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ అహ్మద్.. ఫిబ్రవరి 24 నుంచి పరారీలో ఉన్నాడు. అసద్, గుల్హామ్పై 5లక్షల చొప్పున రివార్డులు ప్రకటించి.. ముమ్మర గాలింపు చేపడుతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఇద్దరూ హతమయ్యారు. ఉమేశ్ పాల్పై కాల్పులు జరిపిన ఓ షార్ప్ షూటర్ సహా ఇద్దరు నిందితులు ఇప్పటికే ఎన్కౌంటర్లో చనిపోయారు. గ్యాంగ్స్టర్, సమాజ్ వాదీ మాజీ ఎమ్మెల్యే అతీక్ అహ్మద్ మూడో కుమారుడు అసద్ అహ్మద్. తన ఇద్దరు అన్నలు మరో కేసుల్లో పోలీసులకు లొంగిపోవడంతో అతీక్ మాఫియా పనులను ఇతడే చూసుకుంటున్నాడు. రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్పాల్ మర్డర్కు అతీక్ జైలు నుంచే పథకం రచించగా.. దాన్ని అసద్ అమలు చేశాడు.
ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేని అసద్.. అప్పటివరకు యూపీ పోలీసుల రాడార్లో లేడు. ఉమేశ్ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో అసద్ కనిపించడంతో అతడిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఘటన సమయంలో అసద్ స్పాట్లో ఉండటమే గాక.. ఉమేశ్ పాల్ ఇంట్లోకి పారిపోతుండగా వెనక నుంచి కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేల్చారు. ఉమేశ్ పాల్ హత్య తర్వాత అసద్ అహ్మద్ నేపాల్ పారిపోయినట్టు వార్తలొచ్చాయి. దీంతో అక్కడికీ వెళ్లి గాలింపు చేపట్టారు యూపీ పోలీసులు. 50రోజులపాటు రాష్ట్రమంతా జల్లెడపట్టారు. తాజాగా అతడు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో అలర్ట్ అయ్యారు STF పోలీసులు.
ఎదురుకాల్పుల్లో అసద్ను మట్టుపెట్టారు. ఇద్దరు డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో 12 మంది బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది. యూపీలో అధికారం చేపట్టాక మాఫియా, గ్యాంగ్స్టర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉక్కపాదం మోపుతున్నారు 2017 మార్చి నుంచి ఇప్పటివరకు 178 మంది క్రిమినల్స్ను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. అంటే గత ఆరేళ్లలో ప్రతి 13 రోజులకో నేరస్థుడు హతమయ్యాడు. ఇదే కాలంలో 23,069 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు.
Related News
Uttar Pradesh: ఇద్దరు యువకులతో మహిళ డాక్టర్ రాసలీలలు
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఓ హోటల్లో పట్టుబడింది. సదరు మహిళా వైద్యురాలిని తన భర్త అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నాడు.