కోమాలో 13 ఏళ్లు.. నేడు తుది శ్వాస విడిచిన హరీష్ రాణా!
హరీష్ రాణా కన్నుమూశారు. మార్చి 24న ఢిల్లీలోని ఎయిమ్స్లో రాణా తన చివరి శ్వాస విడిచాడు.
- Author : Gopichand
Date : 24-03-2026 - 8:02 IST
Published By : Hashtagu Telugu Desk
Harish Rana: హరీష్ రాణా కన్నుమూశారు. మార్చి 24న ఢిల్లీలోని ఎయిమ్స్లో రాణా తన చివరి శ్వాస విడిచాడు. భారతదేశంలో సుప్రీంకోర్టు నుండి ప్యాసివ్ యుథనేషియా (Passive Euthanasia – కారుణ్య మరణం) అనుమతి పొందిన మొదటి వ్యక్తి హరీష్ రాణా. ఘజియాబాద్కు చెందిన హరీష్ రాణా గత 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఎంతో చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదు. ఆయన తల్లిదండ్రులు పైపు ద్వారా ఆహారం, మందులు అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వారు తమ కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టును ఆశ్రయించారు.
మార్చి 11న ప్యాసివ్ యుథనేషియాకు సుప్రీంకోర్టు అనుమతి
హరీష్ రాణాకు ప్యాసివ్ యుథనేషియా కల్పించేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 11న అనుమతి ఇచ్చింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కులో గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా భాగమేనని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. తీర్పు సందర్భంగా జస్టిస్ పార్దివాలా మాట్లాడుతూ.. “ఇది చాలా బాధాకరమైన విషయం. మాకు ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ హరీష్ను ఈ విధంగా బాధలో ఉంచలేము. మేము చివరి నిర్ణయం తీసుకోవాల్సిన దశకు చేరుకున్నాము” అని వ్యాఖ్యానించారు.
Also Read: యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడిన ప్రధాని మోదీ!
2013 నాటి ప్రమాదం తర్వాత మంచానికే పరిమితం
హరీష్ రాణా తన కాలేజీ చదువు కోసం చండీగఢ్ వెళ్లారు. 2013లో తన హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుండి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో రాణా తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అనేక చోట్ల చికిత్స చేయించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆయన నడవలేరు, కనీసం మాట్లాడలేరు. కేవలం నిద్రపోవడం, మేల్కొనడం అనే ఒక చక్రం మీద మాత్రమే ఆయన జీవనం సాగింది. ఆయన తల్లిదండ్రులు పైపు ద్వారా అందించే ఆహారం, మందుల సహాయంతోనే ఇన్నాళ్లూ ప్రాణాలతో ఉన్నారు.