Family Status: సహజీవన జంటలకు కుటుంబ హోదా.. డిజిటల్ గా జనాభా లెక్కలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 30-03-2026 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదిస్తూ.. దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ భారీ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా కేంద్రం షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
దేశవ్యాప్తంగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 16వ జనాభా గణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభం అవుతున్న ఈ భారీ కసరత్తులో కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా సామాజిక మార్పులకు అనుగుణంగా ఇకపై సహజీవన జంటలను కూడా ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం జనగణన విధివిధానాలను వెల్లడించారు.
రెండు దశల్లో జనగణన ప్రక్రియ..
ఈసారి జనగణనను పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో, అది కూడా రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ఈ దశలో గృహ గణన చేపడతారు. అధికారులు మొబైల్ యాప్తో ప్రతి ఇంటికీ వెళ్లి నివాస వివరాలను సేకరిస్తారు. ఈ దశలోనే అసలైన జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తుల సంఖ్య, వయస్సు, విద్య వంటి వివరాలను ఈ సందర్భంగానే నమోదు చేస్తారు. అయితే, ఈసారి ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది. తద్వారా పౌరులు తమ సమాచారాన్ని ఆన్లైన్లో నేరుగా పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు.
ప్రశ్నావళిలో ఏమేమి ఉన్నాయంటే..?
జనగణన కోసం మొత్తం 33 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. ఇందులో ప్రధానంగా ఇంటి యజమాని పేరు, కులం, కమ్యూనిటీ, కుటుంబ సభ్యుల సంఖ్యకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అలాగే తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వినియోగం, వంటగది సౌకర్యాలు, వంటకు వాడే ఇంధనం, ఇంటర్నెట్, ఫోన్లు, వాహనాలు (సైకిల్ నుంచి కారు వరకు), రేడియో, టీవీ వంటి గృహోపకరణాల గురించి కూడా ఆరా తీస్తారు. అంతేకాకుండా తృణధాన్యాల వినియోగంపై కూడా ఈసారి ప్రశ్నించనున్నారు.
15 ఏళ్ల తర్వాత గణన
సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన.. చివరిసారిగా 2011లో జరిగింది. 2021లో జరగాల్సిన ప్రక్రియ కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన లెక్కలు తేలనున్నాయి. దేశ భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు అత్యంత కీలకం కానున్నాయి. ఇదీ