Maoists Encounter : మరో ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం
మావోయిస్టుల కాల్పుల్లో భద్రతా సిబ్బంది(Maoists Encounter) టీమ్లోని ఒకరు అమరులయ్యారు.
- By Pasha Published Date - 12:20 PM, Thu - 20 March 25

Maoists Encounter : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అడవుల్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు చనిపోగా, ఒక భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీజాపుర్ జిల్లాలోని గంగలూరు అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని, కీలక మావోయిస్టు నేతలు అక్కడికి వచ్చారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులతో కూడిన ప్రత్యేక టీమ్లను అక్కడికి పంపారు. బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అడవుల్లో ఈ టీమ్లు కూంబింగ్ చేస్తుండగా.. మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భారీ కాల్పులు జరిగాయి.
Also Read :Education Department : సంచలనం.. త్వరలోనే ప్రభుత్వ విద్యాశాఖ మూసివేత
ఉదయం 7 గంటల నుంచి కాల్పులు
గురువారం ఉదయం 7 గంటల నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయ్యాక అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఐదుగురు మావోయిస్టుల డెడ్బాడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి భారీగా దొరికాయి. మావోయిస్టుల కాల్పుల్లో భద్రతా సిబ్బంది(Maoists Encounter) టీమ్లోని ఒకరు అమరులయ్యారు.
Also Read :Indian Student : అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్.. హమాస్తో లింకులు ?
ఐఈడీ పేల్చిన మావోయిస్టులు
మరోవైపు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో ఉన్న నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. అబూజ్మడ్ అడవుల్లోని గవాదీ ప్రాంతంలో ఐఈడీని మావోయిస్టులు పేల్చినట్లు తెలిసింది. గాయపడిన ఇద్దరిలో ఒకరు జవాన్ కాగా, మరొకరు ఆఫీసర్. ఈ పేలుడు వల్ల వారి కళ్లు దెబ్బతిన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద గత రెండేళ్లుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు ఎడతెరిపి లేకుండా జరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.