NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్ ‘రీ–ఎగ్జామ్’ డేట్ ఫిక్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 18-06-2026 - 10:24 IST
Published By : Hashtagu Telugu Desk
NEET: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్వర్డ్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. గతంలో జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దు కాగా, సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న (ఆదివారం) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ రీ-టెస్ట్ జరగనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై ఉన్న ఎగ్జామ్ సెంటర్ చిరునామా, రిపోర్టింగ్ సమయం మరియు నిబంధనలను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.
లీకేజీలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత.. విద్యార్థి స్నేహపూర్వక మార్పులు!
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టాయి. పరీక్ష పత్రాల రవాణా కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) హెలికాప్టర్లను ఉపయోగించడం, పరీక్ష కేంద్రాల వద్ద సీసీటీవీ లైవ్ మానిటరింగ్, సోషల్ మీడియా నిఘా వంటి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా, తప్పుడు లీకేజీల ప్రచారాన్ని అడ్డుకోవడానికి టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫారమ్లపై తాత్కాలిక ఆంక్షలు కూడా విధించారు. మరోవైపు, విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీఏ కొన్ని కీలక మార్పులు చేసింది. పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచి మొత్తం 195 నిమిషాలు కేటాయించడమే కాకుండా, క్వశ్చన్ బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునే పేజీలను 2 నుంచి 4కు పెంచారు. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా పరీక్ష పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.