Elections : జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, తేదీలు ప్రకటించిన ఈసీ
మొదటి ఫేజ్ ఎన్నికలు సెప్టెంబర్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
- By Latha Suma Published Date - 04:06 PM, Fri - 16 August 24

Assembly Elections 2024: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో పోలింగ్ జరగనుందని ఈసీ వెల్లడించింది. మొదటి ఫేజ్ ఎన్నికలు సెప్టెంబర్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇక రెండో విడత సెప్టెంబర్ 25న, మూడో విడత ఎన్నికలు అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా జమ్ముకశ్మీర్లో ఎన్నికల ప్రక్రియ పెండింగ్లోనే ఉంది. ఇన్నాళ్లకు అక్కడ పూర్తిస్థాయిలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మొత్తం 90 నియోజకవర్గాలున్న జమ్ముకశ్మీర్లో 87.09 లక్షల మంది ఓటర్లున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. వీళ్లలో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. ఆగస్టు 19వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుందని, ఆగస్టు 20వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజలు జమ్ముకశ్మీర్లో మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, హరియాణా ఎన్నికల తేదీలనూ కూడా ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల చేయనుంది. హరియాణా అసెంబ్లీ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియనుంది. ఇక జార్ఖండ్ విషయానికొస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి వరకు కొనసాగే వీలుంది.
మరోవైపు ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ” 2024 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా యువత నుండి మొదలుకుని వృద్ధుల వరకు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా ప్రపంచంలోనే భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్న ఎన్నికలుగా 2024 లోక్ సభ ఎన్నికలు రికార్డు సొంతం చేసుకున్నాయి ” అని గుర్తుచేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఎంతో చైతన్యం చూపించారని.. ఈసారి వారు హింసను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకే మొగ్గు చూపించారు అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
Read Also: FIR Within 6 Hours: 6 గంటల్లో ఎఫ్ఐఆర్, వైద్యుల భద్రతకు కేంద్రం మార్గదర్శకాలు