Kidneys Care : ఆల్కహాల్ కాదు.. కిడ్నీలను డ్యామేజ్ చేసే మరో డేంజర్ డ్రింక్!
- By Vamsi Chowdary Korata Published Date - 11:36 AM, Sat - 6 December 25
Urologist : మూత్రపిండాలు శరీరంలోని విషపదార్థాలు, వ్యర్థ పదార్థాల్ని తొలగించడంలో సాయపడతాయి. అయితే, ప్రస్తుత బిజీ లైఫ్స్టైల్, తిండి అలవాట్లు మూత్రపిండాల్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎంతో మంచిదనుకోని తాగే ఓ డ్రింక్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ అంటున్నారు.
మూత్రపిండాలు శరీరంలో ముఖ్యమైన అవయవం. మన శరీరం పనితీరులో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఫిల్టర్గా పనిచేస్తాయి. మన రక్తం నుంచి వ్యర్థాలు, టాక్సిన్లు, అదనపు ఉప్పును తొలగిస్తాయి. ద్రవ నియంత్రణ, రక్తపోటు నియంత్రణ, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సాయపడతాయి. అందుకే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
అయితే, ఈ రోజుల్లో జీవనశైలిలో మార్పులు, తిండి అలవాట్లు, కాలుష్యం మూత్రపిండాల పనితీరును డ్యామేజ్ చేస్తున్నాయి. చాలా మంది ఆల్కహాల్ తాగడం వల్ల మూత్రపిండాలు డ్యామేజ్ అవుతాయని నమ్ముతారు. అవును.. అందులో నిజం ఉంది. మందు తాగడం వల్ల మూత్రపిండాలకు హాని కలుగుతుంది.
అయితే, ఆల్కహాల్ కంటే ఎక్కువ హాని చేసే ఇంకో డ్రింక్ ఉంది. అది తాగితే.. మూత్రపిండాలు 70 శాతం వరకు డ్యామేజ్ అవుతాయని సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ అంటున్నారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందాం.
ఈ ఒక్క డ్రింక్ మూత్రపిండాలకు డేంజర్
యూరాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మూత్రపిండాలకు హాని చేసే డ్రింక్ ఏంటో చెప్పారు. అవేంటో కాదు.. మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింక్స్. ఈ రోజుల్లో వీటికి బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యువతలో ఈ ఎనర్జీ డ్రింక్స్పై ఎక్కువ మక్కువ ఉంది. వీటిలో తెగ తాగుతుంటారు.
అయితే, వీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల 70 శాతం వరకు మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఎనర్జీ డ్రింక్స్ కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగించే రసాయనాల్ని కలిగి ఉంటాయి. అందుకే ఎక్కువ కాలం వీటిని తీసుకునే వారికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అంతుకాకుండా కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
WHO కూడా హెచ్చరిక జారీ చేసింది
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఎనర్జీ డ్రింక్స్ గురించి హెచ్చరిక జారీ చేసిందని డాక్టర్ పర్వేజ్ వివరించారు. ముఖ్యంగా మీరు దాదాపు ప్రతిరోజూ వాటిని తాగుతుంటే.. కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే.
అటువంటి పానీయాల్ని తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం ముఖ్యం. ఎవరికైనా ఎనర్జీ డ్రింక్స్ ప్రమాదకరం కావచ్చు. అయితే, ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదని డాక్టర్ అంటున్నారు.
మూత్రపిండాలకు మేలు చేసే పానీయాలు
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. లెమన్ వాటర్, గ్రీన్ టీ, చామంతి టీ, అల్లం టీ, పుదీనా టీ వంటి హెర్బల్ డ్రింక్ కిడ్నీల్లోని వ్యర్థాల్ని తొలగించడంలో సాయపడతాయి.
దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర వంటి వాటితో చేసిన డ్రింక్స్ కూడా తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డ్రింక్స్తో పాటు కొన్ని ఫుడ్స్ తినడం వల్ల కూడా కిడ్నీలు డీటాక్స్ అవుతాయి.
నిమ్మకాయ
ఆహార రుచిని పెంచడానికి నిమ్మకాయను సాధారణంగా ఇళ్లలో ఉపయోగిస్తారు. దీని పుల్లని రుచి అంటే చాలా మందికి ఇష్టం. నిమ్మకాయ ఆహార రుచిని పెంచడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడంలో చాలా సాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది.
వెల్లుల్లి
మన వంటగదిల్లో దొరికే అద్భుత ఔషధం వెల్లుల్లి. భారతీయ వంటకాల్లో ముఖ్యమైన భాగం. ఇది ఆహార రుచిని పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇవి మూత్రపిండాల కణాల్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయి. వెల్లుల్లి శరీరం నుంచి టాక్సిన్లు తొలగించడానికి సాయపడే కాలేయం, మూత్రపిండాల్లో ఎంజైమ్ల్ని కూడా సక్రియం చేస్తుంది.