TTD: తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం
- By Balu J Published Date - 11:09 PM, Fri - 3 May 24

TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 12న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు.
కాగా గురుసంక్రమణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీమేధా దక్షిణామూర్తికి విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పంచమ గ్రహమైన గురువు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశించిన నేపథ్యంలో గురువారం విశేషో త్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయ అనువంశీక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో సంకల్ప పూజలు ఘనంగా చేపట్టారు. ప్రధాన కలశంతో పాటు పరివార దేవతలు, 108 శంఖువుల్లో పవిత్ర జలాన్ని ఉంచి పూజాదికాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు.