BAPS Hindu Mandir: రేపు అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోదీ
అయోధ్యలో రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.
- By Praveen Aluthuru Published Date - 03:51 PM, Tue - 13 February 24

BAPS Hindu Mandir: అయోధ్యలో రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రారంభం కానుంది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం విశేషం.
యుఎఇ రాజధాని అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రారంభం కానుంది. అబుదాబి నగరంలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS)పేరుతో నిర్మితమవుతున్న అతిపెద్ద హిందూ దేవాలయం ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అయితే అక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ చేత అబుదాబిలో హిందూ మందిర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మోదీకి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు మోడీకి స్వాగతం పలికేందుకు నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు 60,000 మందికి పైగా భారతీయులు నమోదు చేసుకున్నారు. ప్రధానంగా పాఠశాల విద్యార్థులు స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శిస్తారు.
ఆలయంలో ప్రధాన దేవత స్వామి నారాయణతో పాటు ఏడుగురు దేవతలు ఉన్నారు. వీరిలో తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుడు, తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు ఉంటారు. ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్యాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఆలయ ఎత్తు 108 అడుగులు కాగా.. నిర్మాణానికి 40 వేల క్యూబిక్ ఫీట్ల పాల రాయి.. 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు.
Also Read: Kadiam : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందిః కడియం శ్రీహరి