Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’పై మరింత హైప్.. కీలక పాత్రలో ప్రముఖ హీరోయిన్!
నటీనటుల విషయానికి వస్తే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
- By Gopichand Published Date - 09:55 AM, Wed - 12 November 25
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi)పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రామీణ క్రీడా నేపథ్య యాక్షన్ డ్రామా నుంచి విడుదలైన తొలి పాట ‘చికీరి చికీరి’ సాధించిన అద్భుతమైన స్పందనతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ పాటకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. త్వరలో డిసెంబర్లో చరణ్ క్యారెక్టరైజేషన్ను వివరించే మరో ఎనర్జిటిక్ మాస్ సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుభవజ్ఞురాలైన నటి శోభన ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారు. ఈ వార్త ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు బుచ్చిబాబు సానా చాలా మంది సీనియర్ నటీమణులను పరిశీలించి, చివరకు నటనలో తనదైన ముద్ర వేసిన శోభనను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శోభన గతంలో రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో ‘రుద్రవీణ’, ‘రౌడీ అల్లుడు’ వంటి చిత్రాలలో నటించారు. ఇప్పుడు ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మెగా అభిమానులకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. శోభన వంటి సీనియర్ నటి రాకతో కథనానికి బలమైన భావోద్వేగ కోణం తోడవుతుందని భావిస్తున్నారు.
Also Read: Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉత్తరాంధ్ర ప్రాంతపు నేపథ్యంలో సాగుతుందని, ఇందులో రామ్ చరణ్ క్రీడాకారుడిగా సరికొత్త అవతారంలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెహమాన్ సంగీతం ఇవ్వడం తన చిన్ననాటి కల అని రామ్ చరణ్ ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో వ్యక్తం చేశారు.
నటీనటుల విషయానికి వస్తే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రతిభావంతులైన నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ పాన్-ఇండియా చిత్రాన్ని మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.