మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్
- Author : Vamsi Chowdary Korata
Date : 18-02-2026 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
Vijayendra Prasad తమ పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక వాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని దారుణాలకు పాల్పిడినట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు తెలిసి ఏ తప్పు చేయలేదని.. గతంలో తమ వాళ్లు చేసిన పనికి క్షమించాలని కోరారు.
- మా పూర్వీకులు సంపన్నులు
- అంటరానితనం పేరుతో దారుణాలు చేశారు
- అందర్ని క్షమించమని అడుగుతున్నా: విజయేంద్ర ప్రసాద్
ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 17) రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రాంబాయి అంబేడ్కర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని ప్రసగించారు. తమ పూర్వీకులు సంపన్న కుటుంబానికి చెందిన వారని.. వారు అంటరానితనం పేరుతో నోటితో చెప్పటానికి వీల్లేని భయంకరమైన దారుణాలు చేశారన్నారు. అయితే తనకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయాలేదని వ్యాఖ్యనించారు. అప్పటి పరిస్థితులను తలుచుకుంటే మనసు సిగ్గుతో చచ్చిపోతుందని.. అవమానంతో కుంగిపోతుందని.. అందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తమ పూర్వీకులు చేసిన తప్పుకు క్షమించాలని వేడుకున్నారు.
అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం తన కార్యాలయంలో మహనీయుడు అంబేడ్కర్ చిత్రం మాత్రమే ఉంటుందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై ఒక సినిమా కథ రాస్తున్నానని.. ప్రస్తుతం దానిపై పరిశోధన చేస్తున్నాట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ పాట పాడి సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలామా.. పోరు తెలంగాణమా’ అంటూ ఆయన ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాటను పాడారు. కాగా, విజయేంద్ర ప్రసాద్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి అన్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమాలకు దాదాపు అన్నింటికీ విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తారు. ప్రధాన కథాంశాన్ని తండ్రి ఇస్తే, రాజమౌళి దానిని అద్భుతమైన స్క్రీన్ప్లే, సన్నివేశాలుగా మలచుకుంటారు. మగధీర, బాహుబలి, మగధీర వంటి చిత్రాల విజయాల వెనుక ఈ కాంబినేషన్ కీలక పాత్ర పోషించింది.
ఇక మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమ నిర్వాహకురాలు బీఎన్ రత్న సారథ్యంలో గద్దర్ సతీమణి విమల గద్దర్, ఐఆర్టీఎస్ అధికారి భరత్ భూషణ్ సతీమణి అప్పికట్ల నళిని, మాస్టార్జీ సతీమణి గంగాధరి ప్రమీల, మంత్రి వివేక్ సతీమణి గడ్డం సరోజ, మల్లేపల్లి లక్ష్మయ్య సతీమణి మల్లేపల్లి జయ, నిర్మాత బొమ్మకు మురళీ సతీమణి హిమమాల బొమ్మ, జేబీ రాజు సతీమణి ఆకాశపు అచ్చమాంబలకు మాతా రాంబాయి అంబేడ్కర్ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారిణి విమలక్క, సాంస్కృతిక సారథి ఛైర్పర్సన్ వెన్నెల గద్దర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.