బాలీవుడ్ లోకి బోయపాటి.. సన్నీ డియోల్ జాట్ 2 కు దర్శకత్వం వహించే ఛాన్స్!
- Author : Vamsi Chowdary Korata
Date : 13-03-2026 - 10:55 IST
Published By : Hashtagu Telugu Desk
Boyapati Srinu టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ చిత్రానికి సీక్వెల్ను బోయపాటి శ్రీను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారనే వార్తలతో అంచనాలు పెరిగాయి.
టాలీవుడ్లో మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి భారీ క్రేజ్ ఉంది. . హీరోయిజాన్ని భారీ స్థాయిలో చూపిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించే మాస్ ఎలివేషన్లతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారాయన. హీరోలను ‘లార్జర్ దన్ లైఫ్’గా చూపించడం, పవర్ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం బోయపాటి స్టైల్. అందుకే టాలీవుడ్లో యాక్షన్ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీనేనని సినీ వర్గాలు చెబుతుంటాయి.
బోయపాటి శ్రీను కెరీర్లో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘అఖండ’ సినిమాలో అఘోరా పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్ యాక్షన్కు ఆధ్యాత్మిక భావజాలాన్ని జోడించి కొత్త తరహా మాస్ సినిమాను చూపించడంలో బోయపాటి విజయవంతమయ్యారు. ఆయన సినిమాల్లో యాక్షన్ మాత్రమే కాకుండా కుటుంబ బంధాలు, ధర్మం, న్యాయం వంటి అంశాలు కూడా బలంగా కనిపిస్తాయి. అందుకే ఆయన చిత్రాలకు మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.
ఇటీవల ‘అఖండ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి ప్రస్తుతం తదుపరి ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయంలో కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. తమిళ హీరోతో సినిమా చేస్తారన్న వార్తలు, బాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నారన్న ప్రచారం కూడా వినిపించింది. అలాగే అల్లు అర్జున్తో ‘సరైనోడు 2’ కూడా తీస్తారని వార్తలొచ్చాయి. తాజాగా మరో ఆసక్తికరమైన టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే బాధ్యతలను బోయపాటి శ్రీను తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సన్నీ డియోల్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్కు బోయపాటి శ్రీను మార్క్ మాస్ యాక్షన్ కలిస్తే భారీ స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతుందని సినీప్రియులు భావిస్తున్నారు.
సన్నీ డియోల్ గతంలో ‘గదర్ 2’తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ‘జాట్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం 2025 ఏప్రిల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. మాస్ యాక్షన్ సన్నివేశాలు, సన్నీ డియోల్ పవర్ఫుల్ డైలాగులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘జాట్’ సినిమాలో రణ్దీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, రెజీనా కాసాండ్రా, సయామీ ఖేర్, జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని ఎస్. తమన్ అందించగా, సినిమాటోగ్రఫీ రిషి పంజాబీ నిర్వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. విజయవంతమైన ఈ చిత్రానికి సీక్వెల్ను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తారన్న వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి మరింత పెరిగింది. టాలీవుడ్ మాస్ యాక్షన్ స్టైల్ను బాలీవుడ్ ప్రేక్షకులకు చూపించబోతున్న ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.