అల్లు శిరీష్ పెళ్లి..పవన్ కల్యాణ్, నాగబాబులకు శుభలేఖ
- Author : Vamsi Chowdary Korata
Date : 23-02-2026 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Sirish ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 6న జరగనున్న తన వివాహానికి మెగా కుటుంబ సభ్యులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో, తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాతో వీరు కాసేపు ముచ్చటించారు.
మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన భార్య పద్మజను కూడా కలిసి వివాహ వేడుకలకు రావాలని కోరారు. ఈ ఆహ్వానాలకు సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “నేను, మా అమ్మానాన్న కలిసి పవన్ కళ్యాణ్ గారిని, శ్రీమతి లెజ్నేవా గారిని మా పెళ్లికి ఆహ్వానించాం. అలాగే నాగబాబు గారిని, శ్రీమతి పద్మజ గారిని కూడా మా వివాహ వేడుకలకు పిలిచాం. వారంతా నా పెళ్లి జరుగుతుండడం పట్ల చాలా సంతోషించారు” అని శిరీష్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికా రెడ్డిని మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. హైదరాబాద్లో ఈ వివాహం సంప్రదాయబద్ధంగా జరగనుంది. విశేషమేమిటంటే, మార్చి 6వ తేదీ శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల పెళ్లి రోజు. వారు 2011లో ఇదే తేదీన ఒక్కటయ్యారు. గతేడాది అక్టోబర్ 31న శిరీష్-నయనికా రెడ్డిల నిశ్చితార్థం జరగ్గా, దుబాయ్, హైదరాబాద్లలో గ్రాండ్గా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.